హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పల్లెల ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులు అట్టడుగు స్థాయికి చేరడం లేదు. పంచాయతీ సెక్రటరీలు, స్థానిక పాలకవర్గాలు (సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు) కలిసి ఆ సొమ్మును విచ్చలవిడిగా పక్కదారి పట్టిస్తున్నారు. ఐదేండ్ల క్రితం చేసిన పనులనే ఇప్పుడు మళ్లీ కొత్త యాక్టివిటీగా ఆన్లైన్ చేసి నిధులను డ్రా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పని ఒకటి ఉంటే.. కాగితాల్లో బిల్లు మరొకటి పెట్టి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడకపోవడంతో గత రెండేండ్లుగా ఆగిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఇటీవలే విడుతలవారీగా మంజూరయ్యాయి. గతంలో పనులు చేసిన మాజీ సర్పంచ్లకు ఆ నిధులు చెల్లించాల్సి ఉన్నది. కొన్ని గ్రామాల్లో మాజీ సర్పంచ్లు ఎంబీలు చేసుకొని బిల్లులు తీసుకోగా, మరికొన్ని గ్రామాల మాజీ సర్పంచ్లు పెండింగ్ బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, మాజీ సర్పంచ్లకు బిల్లులు చెల్లించవద్దని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిసింది.
పెద్దపల్లి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇటీవల వెలుగుచూసిన ఉదంతాలను పరిశీలిస్తే అవినీతి తిమింగలాల తెగింపు అర్థమవుతుంది. ఒక గ్రామంలో ప్రజల ఆరోగ్యం కోసం వాడాల్సిన శానిటరీ మెటీరియల్ పేరు చెప్పి, ఆఫీస్ ఫర్నిచర్ కోసం ఏకంగా రెండుసార్లు (రూ.17,450 + రూ. 44,000 = రూ. 61,450) బిల్లులు పెట్టి నొకేశారు. శానిటరీ వర్స్, ఆఫీస్ ఖర్చుల పేరిట ఏకంగా రూ.1,11,825 బిల్లు సృష్టించి, ఏమాత్రం సంబంధం లేని ఒక వార్డు మెంబర్ కొడుకు వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలోకి యథేచ్ఛగా బదిలీ చేశారు. దీంతో పంచాయతీ నిధులు ప్రజల కోసమా లేక ప్రజాప్రతినిధుల కుటుంబాల కోసమా? అనే ప్రశ్న తలెత్తుతున్నది.
మరికొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డీజిల్ ఖర్చులంటూ ఒకే బిల్లును రెండు మూడు సార్లు ఆన్లైన్ యాక్టివిటీగా చూపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు కేసీఆర్ పాలనలో ట్రాక్టర్లు సమకూరాయి. వాటి ఇంధన ఖర్చుల పేరిట పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పీఎఫ్ఎంఎస్) ద్వారా నేరుగా పెట్రోల్ బంక్ సిబ్బంది వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులు బదిలీ చేసి, ఆ తర్వాత ఆ సొమ్మును దొడ్డిదారిన పంచాయతీ పెద్దలు, సెక్రటరీలు పంచుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం 2025-26 నుంచి బిల్ నోట్ ఫైల్స్ తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలనే నిబంధన తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ఖర్చుల వివరాలను https://egramswaraj.gov.in వెబ్సైట్లో ప్రతి పౌరుడు తెలుసుకొనే చూసే అవకాశం ఉన్నప్పటికీ అవినీతిపరులు ఏమాత్రం భయపడటం లేదు. అసలైన బిల్లులను కాకుండా ఏవో పనికిరాని కాగితాలను అప్లోడ్ చేస్తూ వ్యవస్థ కండ్లకు గంతలు కడుతున్నారు. మండల అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ అక్రమాలకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా అధికారులను ప్రశ్నిస్తే.. ‘ఇలాంటివి ప్రతి గ్రామంలోనూ జరుగుతుంటాయి’ అంటూ బాధ్యతారహితంగా సమాధానమిస్తున్నారు.
దీంతో దోపిడీకి గురైన నిధుల నుంచి వారికీ వాటాలు అందుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 2025-26లో ఆన్లైన్ చేసిన పాత పనుల (2020-23 నాటివి) బిల్లులపై తక్షణమే ప్రత్యేక విచారణ జరుపాల్సిన అవసరం ఉన్నది. నిబంధనలకు విరుద్ధంగా వార్డు మెంబర్ల బంధువుల ఖాతాల్లోకి, పెట్రోల్ బంకుల సిబ్బంది అకౌంట్లలోకి వెళ్లిన సొమ్మును రికవరీ చేయాలని, అక్రమాలకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెట్టాలని గ్రామీణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.