Harish Rao | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్: వైద్యారోగ్యశాఖకు ఆశా వర్కర్లే బలం, బలగం అని ఆ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆశా కార్యకర్తలు విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశంలో వందకు వంద శాతం దవాఖానల్లో ప్రసవాలు (ఇన్స్టిట్యూషనల్) జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, వందశాతం చిన్నారులకు టీకాలు వేసిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణేనని.. ఈ లక్ష్యాల ధనలో ఆశాలదే కీలక పాత్ర అని ప్రశంసించారు. శుక్రవారం శిల్పకలావేదికలో ఏర్పాటు చేసిన ఆశా వర్కర్లకు నియామక పత్రాలు, చీరెల పంపిణీ, అవగాహన కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కొత్తగా నియమితులైన 1,560 మంది ఆశ కార్యకర్తలకు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జీతం పెంచాలని కోరితే ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించి, మహిళలు అనే కనికరం లేకుండా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. కానీ నేడు సీఎం కేసీఆర్ అడగకుండానే ఆశా వర్కర్లకు మూడుసార్లు వేతనాలను పెంచారు. రూ.2 వేల నుంచి రూ.6 వేలకు ఒకసారి.. రూ.6 వేల నుంచి రూ.9,750 రెండోసారి పెంచారు. ఇప్పుడు సెల్ఫోన్ బిల్లు కలిపి రూ.9,900 చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా ప్రాంతాల్లో ఆశా వర్కర్ల జీతం ఇప్పటికీ రూ.4 వేలే. రాజస్థాన్లో రూ.3 వేలు మాత్రమే ఇస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోనూ జీతం రూ.3వేలే. ఇక్కడేమో ప్రతిపక్షంలో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు న్యూట్రిషన్ పాలిటిక్స్ చేస్తుంటే, విపక్షాలు కులమత చిచ్చు పెట్టి పార్టిషన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
‘చిన్నారులకు 100 శాతం టీకాలు వేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వందకు వంద శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏ రంగంలో చూసినా తెలంగాణ అగ్ర స్థానంలో ఉన్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి వైద్యారోగ్య సేవల్లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ. వైద్య సిబ్బంది ప్రత్యేక కృషితో నేడు 3వ స్థానానికి చేరింది. వైద్యారోగ్య శాఖలోకి కొత్తగా ఆశా వర్కర్లు చేరుతుండటంతో బలం, బలగం పెరుగుతున్నది. ఇక ప్రథమ స్థానం లక్ష్యంగా ముందుకు సాగాలి. గతంలో ప్రసవాలు 30 శాతం ప్రభుత్వ దవాఖానల్లో, 70 శాతం ప్రైవేట్ దవాఖానల్లో జరిగేవి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సీఎం కేసీఆర్ కృషి వల్ల 70 శాతం ప్రభుత్వ దవాఖానల్లో, 30 శాతం ప్రైవేట్ దవాఖానల్లో జరుగుతున్నాయన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ది న్యూట్రిషన్ పాలన అయితే, ప్రతిపక్ష పార్టీలు పార్టిషన్ పాలిటిక్స్ చేస్తున్నాయని హరీశ్రావు మండిపడ్డారు. హిందూముస్లింల మధ్య విభజన తెస్తూ, రెచ్చగొడుతూ ఓట్లు దండుకొనే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘ప్రజలు బలంగా ఉండాలి.. సమాజం బలంగా ఉండాలనే న్యూట్రిషన్ పాలిటిక్స్ మన సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నాయి. ఆశా వర్కర్లుగా మీరు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఈ విషయాలను వారికి అర్థమయ్యేలా చెప్పాలి’ అని కోరారు. ప్రైవేట్ డయాగ్నస్టిక్స్కు స్వస్తి చేప్పేలా టీ-డయాగ్నస్టిక్స్ను ఏర్పాటుచేసి 134 వైద్య పరీక్షలను సర్కారు ఉచితంగా అందిస్తున్నదని గుర్తుచేశారు. ప్రతి ఆశా వర్కర్ శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 వేలు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని 27 వేల మంది ఆశా వర్కర్లకు ఈ నెల నుంచే ఫోన్ బిల్లు కూడా ఇస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆశాలకు స్మార్ట్ఫోన్లు కొనిచ్చామని, కొత్తగా చేరిన వారికి కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు. ఫోన్లతోపాటు వాటి బిల్లును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు.
గర్భిణీలకు మెరుగైన వైద్యం అందించేందుకు నగరంలోని గాంధీ, నిమ్స్, అల్వాల్ టిమ్స్లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని హరీశ్రావు తెలిపారు. హైదరాబాద్లో మరో నాలుగు టిమ్స్లు అందుబాటులోకి వస్తాయి. ఉస్మానియా దవాఖాన విషయంలో కొనసాగుతున్న కేసు పరిష్కారం కాగానే అక్కడే అధునాతన నూతన భవనాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు’ అని హరీశ్రావు తెలిపారు. నిమ్స్ దవాఖానలో రూ.34 కోట్లతో రొబోటిక్ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. ‘నిమ్స్ డాక్టర్లను ఎంత మెచ్చుకున్నా తక్కువే. నిన్న 1,498 పడకలు అందుబాటులో ఉంటే, 1,510 మంది రోగులు అక్కడ ఉన్నారన్నారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆశాలకు ఇస్తున్న జీతం రూ.4,500 మాత్రమేనని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లో రూ.5,000 ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఈ నెల నుంచి 9,900 వేతనం అందించనున్నట్టు వెల్లడించారు. అంటే కాంగ్రెస్, బీజీపీ పాలిత రాష్ర్టాల కంటే డబుల్ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడూ ఆశాలకు వేతనాలు ఇవ్వలేదు. ఇప్పుడు వారు పరిపాలిస్తున్న రాష్ర్టాలోనైనా ఇస్తున్నారా? అంటే అదీ లేదు. సెకండ్ ఏఎన్ఎంలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో సెకండ్ ఏఎన్ఎంలకు రూ.13,150, రాజస్థాన్లో రూ.10 వేలు, బీజేపీ పాలిత గుజరాత్లో రూ.12,500, మహారాష్ట్రలో రూ.15వేల జీతం ఇస్తున్నారు. తెలంగాణలో 27,300 ఇస్తున్నాం’ అని వివరించారు. భవిష్యత్తులో ఏఎన్ఎంలుగా సెకండ్ ఏఎన్ఎంలకే అవకాశం కల్పిస్తామని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. పీఆర్సీ, ఎరియర్స్ కూడా చెల్లిస్తామని తెలిపారు.