ముకరంపుర, జూలై 13: కరీంనగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)నిప్రజల సొమ్ముతోనే నిర్మిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ నగర పరిధిలోని తీగలగుట్టపల్లిలో రైల్వే ట్రాక్ వద్ద ఆర్వోబీ కోసం సీఐఆర్ఎఫ్ కింద రూ.154 కోట్లు మంజూరు కాగా గురువారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మండలి విప్ కౌశిక్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయ, మేయర్ సునీల్రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ ఆర్వోబీని 750 మీటర్ల పొడవుతో నాలుగు వరుసలుగా, రాబోయే 40 ఏండ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మిస్తామని తెలిపారు. ఏడాదిలోగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మాట్లాడుతూ..
పెద్దపల్లి – కరీంనగర్ – నిజామాబాద్ లింకు అందుబాటులోకి రావడంతో కరీంనగర్కు రైళ్ల రాకపోకలు పెరిగినట్టు తెలిపారు. మహారాష్ట్ర వైపు వెళ్లే బొగ్గు, సిమెంటు, డీజిల్, పెట్రోల్, గూడ్స్ రైళ్ల రాకపోకలకు కరీంనగర్ లైన్ దగ్గరి మార్గంగా ఉన్నదని అన్నారు. రైళ్ల రద్దీతో కరీంనగర్-చొప్పదండి మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగినట్టు చెప్పారు. ఈ సమస్యను మంత్రి గంగుల సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా, సీఐఆర్ఎఫ్ కింద రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు ఆర్అండ్బీ మంత్రి ప్రశాంత్రెడ్డి ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, కేవలం ఐదు మాత్రమే మంజూరయ్యాయని, అందులో కరీంనగర్ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఆర్వోబీ కోసం రైల్వే శాఖ రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర వాటాలు లేకుండా సీఐఆర్ఎఫ్ కిందే ఆర్వోబీని నిర్మిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.