హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినప్పటి నుంచి ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో సీట్ల కోసం కొట్లాటలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 1500 ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీలైనంత మేరకు అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్ బస్సుల్ని ఆర్టీసీ తీసుకొంటున్నది. ఇప్పుడున్న పాత బస్సుల స్థానంలో కొత్తవి కొనేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
జూలై కల్లా 450 ఎలక్ట్రిక్ బస్సులు
ఇక పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇప్పుడు దాదాపు 105 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యి పైచిలుకు రోడ్డెకించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో జూలై కల్లా 450 అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ బస్సులను నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు.. అదేవిధంగా జిల్లాల్లో ఇతర ప్రాంతాలకు నడిపించేలా ఆర్టీసీ కార్యాచరణకు సిద్ధమవుతున్నది.