దేశానికి ఆదర్శంగా మన పట్టణాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. మౌలిక వసతుల కల్పన మొదలు అభివృద్ధి కార్యక్రమాల దాకా అన్నింట్లో నంబర్ వన్గా నిలుస్తున్నాయి. పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నది. వాటిని ప్రజలకు చేరువ చేస్తున్న మున్సిపల్ శాఖ కృషి ఎనలేనిది. హరితహారంలోనూ తన ప్రత్యేకతను చాటుకొన్నది. గత ఏడాది 3.16 కోట్ల మొక్కలు నాటి పట్టణాలకు పచ్చలహారాన్ని తొడిగింది.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): దేశంలో వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందంజలో ఉన్నదని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. పట్టణాల్లోని పౌరుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావటమే లక్ష్యంగా పురపాలకశాఖ పనిచేస్తున్నదని చెప్పారు. తెలంగాణకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ మనుగడ కొనసాగిస్తున్నదని తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్లో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ వార్షిక ప్రగతి నివేదికను శాఖ అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి చెందుతున్నదని, ఏడేండ్లలో సర్కారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు. భవిష్యత్తులోనూ పట్టణాల అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టునున్నట్టు వివరించారు. కరోనా సంక్షోభ పరిస్థితులను కూడా అవకాశంగా మలుచుకొని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లిన మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులను మంత్రి ప్రశంసించారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరపాలక సంస్థల్లో లాక్డౌన్ను సద్వినియోగం చేసుకొని పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పించామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఎస్బీపాస్: పట్టణాలు, నగరాల్లో ఇండ్లు నిర్మించాలనుకొనే వారి కష్టాలను తొలగించడానికి, అవినీతి, నిర్లక్ష్యం, జాప్యానికి అవకాశం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో టీఎస్బీపాస్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం పట్టణాల పరిధిలో ఉన్న ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచన చేస్తున్నారు. స్వీయ ధ్రువీకరణ విధానంలో అనుమతులు ఇస్తారు.
మానవ వ్యర్థాల శుద్ధి కర్మాగారాలు (ఎఫ్ఎస్టీపీ): ఎఫ్ఎస్టీపీల ద్వారా మానవ వర్థాలను ప్రాసిసెంగ్ చేసి కాలుష్య నివారణకు ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ఏడు ఎకో-ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్వహించగా , ఆరు ఎఫ్ఎస్టీలు నిర్మాణంలో ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 36 మిలియన్ లీటర్ల సెప్టేజ్ కో-ట్రీట్మెంట్ సదుపాయాల వద్ద శుద్ధిచేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో 71 పట్టణ స్థానిక సంస్థల్లో ఎఫ్ఎస్టీపీల టెండర్లు పిలిచారు. వీటిలో ఏడింటి నిర్మాణం పూర్తైంది. మరో 68 పట్టణ స్థానిక సంస్థల్లో టెండర్లు పిలిచారు.
ప్రజా మరుగుదొడ్లు: జనాభా లెక్కలకు అనుగుణంగా రాష్ట్రంలోని పట్టణాల్లో 7,683 అవసరం ఉండగా, పాతవి 4,804 ప్రజా మరుగుదొడ్లు ఉన్నాయి. కొత్తగా 3,933 ప్రజామరుగుదొడ్లను కట్టగా, 154 నిర్మాణదశలో ఉన్నాయి. మొత్తం 8,891 ప్రజామరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి.
వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు: సఫాయి కర్మ మిత్ర సురక్ష సవాల్ కింద మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులను యంత్రాలతో శుభ్రం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, వరంగల్, నిజామాబాద్, నిజాంపేట, కరీంనగర్, రామగుండం, ఖమ్మం నగరపాలక సంస్థలను ఎంపిక చేశారు. హైరాబాద్ను ఓడీఎఫ్++గా ప్రకటించారు. మిగిలిన 140 పట్టణ స్థానిక సంస్థలు ఓడీఎఫ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఆరు పట్టణాలు, నగరాలు ఓడీఎఫ్++కు గుర్తింపు పొందాయి. 64 పట్టణ స్థానిక సంస్థలు ఓడీఎఫ్+ గుర్తింపుపొందాయి. మరో 70 పట్టణ స్థానిక సంస్థలు గుర్తింపు పొందే ప్రక్రియలో ఉన్నాయి. మరో 10 పట్టణ స్థానిక సంస్థలు ఓడీఎఫ్++ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోనున్నాయి.
వరంగల్కు మెట్రో: తెలంగాణలో అత్యంతవేగంగా విస్తరిస్తున్న నగరాల్లో వరంగల్ ఒకటి. అభివృద్ధితో సమానంగా రవాణా సదుపాయలు ఉండేలా మెట్రో నియో ప్రాజెక్టును వరంగల్కు ప్రతిపాదించారు. వరంగల్-కాజీపేట రైల్వేస్టేషన్ను కలుపుతూ 21 స్టేషన్లలో 7.1కిలోమీటర్ల మేర, ఎలివేటెడ్ సిస్టం-8.4 కిలోమీటర్లు ఆలైన్మెంట్ను ఖరారు చేశారు.
రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ డ్రేనేజీ వ్యవస్థ 15 శాతం మాత్రమే. రూ.1,235కోట్ల అంచనా వ్యయంతో 11 ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. రూ.447కోట్ల అంచనా వ్యయంతో వికారాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో, రూ.266కోట్ల అంచనా వ్యయంతో సిద్దిపేటలో, రూ.168కోట్ల అంచనా వ్యయంతో నల్లగొండ, మిర్యాలగూడలో పనులు జరగుతున్నాయి. రూ.353కోట్ల అంచనా వ్యయంతో ఖమ్మం, సూర్యాపేట, నాగర్కర్నూలు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దేవరకొండలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి.
పట్టణ హరితహారం: పట్టణ ఉద్యానవనాలు, పార్కులు, నర్సరీలను పెద్దఎత్తున ఏర్పాటుచేశారు. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం గ్రీనరీకి మున్సిపల్ బడ్జెట్లో రూ.256 కోట్లు కేటాయించారు. మూసీనది కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. రూ.392 కోట్లతో మూసీనదిపై 14 అదనపు వంతెనలను నిర్మించాలని నిర్ణయించారు.
ఆర్థిక వనరులు: ఏప్రిల్, మేలో ఆస్తిపన్ను చెల్లించినవారికి ఎర్లీబర్డ్ పథకం కింద ఐదు శాతం రాయితీని ప్రకటించారు. తద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో రూ.576 కోట్లు, ఇతర పట్టణాల్లో రూ.129 కోట్లు వసూలయ్యాయి. 2020-21లో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1,703కోట్లు, ఇతర పట్టణాలు, నగరాల్లో రూ.719 కోట్లు వసూలయ్యాయి. అటు.. పట్టణాల్లోని ఇండ్లను మ్యాపింగ్ చేయాలని మున్సిపల్శాఖ నిర్ణయించింది. ఇప్పటికే 4.50 లక్షల ఇండ్లకు మ్యాపింగ్ పూర్తైంది.
వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు: ఒకేదగ్గర కూరగాయలు, మాంసాహారం, పూలు, పండ్లు లభ్యమయ్యేలా ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021-22 బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించారు. 149 మార్కెట్లకు అనుమతులు ఇచ్చారు.
ప్రతిఇంటికి ప్రతిరోజు నగర పాలక సంస్థల్లో ఒక్కొక్కొరికి రోజుకు 150 లీటర్లు, మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఒక్కొక్కరికి 135 లీటర్ల చొప్పున శుద్ధి చేసిన నీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. జీహెచ్ఎంసీలో గృహ నీటి వినియోగదారులకు 20వేల లీటర్ల ఉచిత నీటిని సరఫరా చేస్తుండగా, 9.7 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది. అమృత్ పథకం రూ.1753కోట్ల అంచనా వ్యయంతో పనులు చేశారు. పది స్థానిక సంస్థల్లో పనులు పూర్తయ్యాయి. ప్రపంచ బ్యాంకు సహకారం(రూ.225 కోట్లు)తో జమ్మికుంట, కొల్లాపూర్, హుజురాబాద్, కొత్తగూడెంలో తాగునీటి పనులు పూర్తయ్యాయి.
రూ.8,598 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ పరిధిలో 111 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇందులో 40 ప్రాంతాలు స్లమ్ ఏరియాలు కాగా, మిగిలిన 71 ఖాళీ ప్రాంతాలు. మొత్తం గా 51ప్రాంతాల్లో 61,783 నిర్మాణాలు పూర్తయ్యాయి. 60 ప్రాంతాల్లో 38,217 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి.