హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది ఇంజినీరింగ్లో 15,447 సీట్లు మిగిలాయి. ఫార్మసీలో 3,965 సీట్లు భర్తీ కాలేదు. ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ముగిశాక మొత్తం19,412 సీట్లు మిగిలినట్టు అధికారులు వెల్లడించారు. సివిల్, మెకానికల్ విభాగాల్లో 32 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ఈ విభాగంలో 3,328 సీట్లు నిండితే.. 6958 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎంసెట్ మూడో విడత సీట్లను అధికారులు మంగళవారం కేటాయించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల్లో కలిపి 6వేలకుపైగా సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 83,371 సీట్లకు 63,959 సీట్లు నిండగా, 19,412 సీట్లు భర్తీకాలేదు. ఇంజినీరింగ్ ఫస్టియర్ క్లాసులు నవంబర్ మొదటి వారంలో ప్రారంభంకానున్నాయి.
యూనివర్సిటీల్లోను ఖాళీ..
యూనివర్సిటీ కాలేజీల్లో సీట్లంటే హాట్కేకుల్లాంటివి. అలాంటిది ఈ ఏడాది యూనివర్సిటీ కాలేజీల్లోనూ సీట్లు మిగిలాయి. 16 యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీల్లో 4,914 సీట్లుంటే.. 3,771 సీట్లు భర్తీ కాగా, 1,143 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 72,66 శాతం, ప్రైవేట్ కాలేజీల్లో 80.94శాతం సీట్లు నిండాయి. మొత్తం మీద ఒక యూనివర్సిటీ, 27 ప్రైవేట్ కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి.