హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా చివరి దశ 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 8 కాలేజీల నిర్మాణానికి మొత్తం రూ.1,447 కోట్లు ఖర్చు చేయనున్నది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ శనివారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు, ల్యాబ్లు, సెమినార్ హాళ్లు, అనుబంధ దవాఖాన భవనాలు, హాస్టల్ భవనాల నిర్మాణం తదితర వసతులను కల్పించనున్నారు. జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, వరంగల్, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, ములుగు, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో కాలేజీ భవనాల నిర్మాణంపై వైద్యారోగ్య శాఖ, ఆర్అండ్బీ అధికారులు అధ్యయనం చేశారు. నిర్మాణానికి రూ.1,447 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సమర్పించారు. వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం వచ్చే ఏడాదితో పూర్తికానున్న సంగతి తెలిసిందే. 2014 వరకు తెలంగాణలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. శుక్రవారం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరింది. చివరి దశగా వచ్చే ఏడాది కోసం మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఇప్పటికే మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరన్నుది.
వేగంగా పనులు పూర్తి
8 కాలేజీల నిర్మాణానికి రూ.1,447 కోట్లు నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకొక డిగ్రీ కాలేజీ కూడా లేని పరిస్థితి. వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మారిన రోజులు. ఇక అదంతా గతం. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేసుకున్నాం. ఏటా 10 వేల మంది వైద్యులను తయారు చేసే స్థాయికి చేరుకున్నాం. వచ్చే ఏడాది ప్రారంభించే 8 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి, ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ ప్రజలకు వైద్యం, వైద్య విద్య కష్టాలను దూరం చేసిన ఘనత కేసీఆర్కే దకుతుంది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ మెడికల్ హబ్గా అవతరించింది.
– హరీశ్రావు,వైద్యారోగ్య శాఖ మంత్రి