హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): పోలింగ్ సామగ్రి, సిబ్బందిని కేంద్రాలకు తరలించేందుకు టీఎస్ఆర్టీసీ నుంచి 1,406 బస్సులను ఈసీ అద్దెకు తీసుకున్నది. బస్సులు బయలుదేరిన ప్రాంతం నుంచి తిరిగి వచ్చే వరకు బస్సు రూట్ను ఈ జీపీఎస్ ద్వారా ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తారు. ఎన్నికల కమిషన్ ఖరారు చేసిన ధరల ప్రకారం ఒక్కో బస్సుకు రోజుకు రూ.20 వేలు ఆర్టీసీకి అద్దె చెల్లిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ వాహనాలను కూడా ఈసీ వినియోగిస్తున్నది.
తెలంగాణ ఓటర్లకు వేతన సెలవు
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటరు కార్డు చూపితే సెలవు వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నది.