హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశించే వారి నుంచి శుక్రవారం పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఒకేరోజు వంద దరఖాస్తులు రాగా, ఇప్పటికే ఆ సంఖ్య 140కి చేరింది. దరఖాస్తుల సమర్పణకు శనివారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉన్నది. చివరిరోజు భారీగా దరఖాస్తులు రావచ్చని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం గాంధీభవన్లో దరఖాస్తులు అందజేసిన ముఖ్యులలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి బంధువు మురళీధర్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (మల్కాజిగిరి స్థానం), మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్, పారిశ్రామికవేత్త రాజేంద్రప్రసాద్ ఉన్నారు. కాగా, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, పెద్దపల్లి, వరంగల్, మహబాబాబాద్, మల్కాజ్గిరి టికెట్కు అధిక సంఖ్యలో దరఖాస్తులు అందినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, విద్యావేత్త డాక్టర్ స్రవంతి పార్టీ రాష్ట్ర ఇంచార్జీ దీపాదాసు మున్షీ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్లో చేరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసేందుకు పలువురు ప్రొఫెసర్లు సై అంటున్నారు. వీరిలో అత్యధికులు రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్నాయక్ మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ శుక్రవారం దరఖాస్తు చేశారు. ఇదే స్థానం నుంచి మాజీ ఎంపీ సీతారాంనాయక్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ప్రొఫెసర్ గాదె దయాకర్ పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. వరంగల్, పెద్దపల్లిలో ఏదో ఒక స్థానం నుంచి ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.