హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం కొత్తగా 14 హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.140 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం హర్షం వ్యక్తంచేసింది. ఇలాంటి చారిత్రక నిర్ణయం తీసుకొన్న సీఎం కేసీఆర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్లకు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎం ధనుంజయ్నాయక్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీ హరిచరణ్, ఉపాధ్యక్షుడు రమణ్నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహత్మాగాంధీ, జేఎన్టీయూహెచ్, ఉస్మానియా, పాలమూరు వర్సిటీల్లో అమ్మాయిలకు ఒక హాస్టల్, అబ్మాయిలకు ఒక హాస్టల్ చొప్పున నిర్మిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా, ఎస్టీ కమిషన్ను నియమించాలని, నామినేటెడ్ పోస్టుల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లల్లో ప్రాతినిథ్యం కల్పించాలని వారు విజ్ఞప్తిచేశారు.