హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసుల కాల్పుల్లో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు గాంధీ దవాఖాన వైద్యులను ఆదేశించారు. అగ్నిపథ్ వ్యతిరేక పోరాటంలో గాయపడ్డ 14 మంది బాధితులు గాంధీలో చికిత్స పొందుతున్నారు. మంత్రి ఆదేశాలతో బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరం. నిన్న కిసాన్ను, నేడు జవాన్ను రోడ్డు మీద పడేసిన ఘనత బీజేపీదే. అగ్నిపథ్ పేరుతో దేశ రక్షణ కోసం పనిచేయాలనుకొనే యువతను బీజేపీ ఘోరంగా అవమానిస్తున్నది. అల్లర్ల వెనుక టీఆర్ఎస్ ఉన్నదని ఆరోపించడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనం. బీహార్, ఉత్తరప్రదేశ్ ఆందోళనల వెనుక ఎవరున్నారు? అకడా టీఆర్ఎస్సే ఉన్నదా? బండి సంజయ్ లాంటి అజ్ఞానులు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే అశాంతి, అభద్రత నెలకొంటున్నాయి.
-వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి
అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఘటనలకు కేంద్రమే బాధ్యత వహించాలి. సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన, గాయపడినవారి కుటుంబాలకు కేంద్రం పరిహారం చెల్లించాలి. అగ్నిపథ్ పథకం అనాలోచిత నిర్ణయం. దేశ భద్రత విషయంలో ఈ నిర్ణయం అవివేకం. బీజేపీ అపరిపక్వ విధానాల వల్ల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు కొనసాగుతున్నాయి.
-సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకారులపై రైల్వే పోలీసుల కాల్పులు దురదృష్టకరం. దామెర రాకేశ్ మృతి చెందటం, అనేక మంది గాయపడటం విచారకరం. కేంద్ర ప్రభుత్వ ఆనాలోచిత, అపరిపక్వ, అసంబద్ధ విధానాల వల్ల జరిగిన అనర్థమిది. జాతీయ స్థాయిలో కేవలం 46 వేల మందిని రిక్రూట్ చేయడానికి కేంద్రం ఇంత రాద్ధాంతం చేయటం దారుణం. బీజేపీ వ్యవసాయ చట్టాలతో రైతుల, అగ్నిపథ్తో యువత ఉసురు పోసుకొంటున్నది. నిరుద్యోగులు సంయమనం పాటించాలి.
-ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి
ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయాల వల్లే నాడు రైతులు, నేడు యువత రోడ్లపైకి వచ్చారు. సికింద్రాబాద్ ఘటన తీవ్ర విచారకరం, బాధాకరం, దురదృష్టకరం. యువతను మరింత రెచ్చగొట్టే విధంగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. సికింద్రాబాద్ ఘటన వెనుక టీఆర్ఎస్ ఉన్నదని బండి సంజయ్ వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నాం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్లోనూ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ రాష్ర్టాల్లోనూ టీఆర్ఎస్ ఉన్నదా?
-కొప్పుల ఈశ్వర్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి
అగ్నిపథ్ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్య. దేశవ్యాప్త ఆందోళనలతోనైనా మోదీ ప్రభుత్వం కండ్లు తెరచి, అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ ఉన్నదని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యాలను ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ పాలనలో హింసకు తావులేదు. డిమాండ్ల సాధనకు యువత శాంతియుతంగా నిరసన చేపట్టాలి.
-ఆల్లోల ఇంద్రకరణ్రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
అగ్నిపథ్ దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు. ఈ పథకం పిచ్చి చర్య. సికింద్రాబాద్ ఘటనలో మరణించిన రాకేశ్ కుటుంబానికి కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అగ్నిపథ్ను కేంద్రం వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు ముగింపు పలికేందుకు యువత సిద్ధంగా ఉండాలి. దేశవ్యాప్త ఘటనలకు కేంద్రమే బాధ్యత వహించాలి.
-వీ శ్రీనివాస్గౌడ్, సాంస్కృతికశాఖ మంత్రి
అగ్నిపథ్ పేరుతో కేంద్రం యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నది. ఒక ప్రకటన ఇచ్చి దేశమంతా అగ్గి పెట్టారు. దేశ భద్రత విషయంలో ఇంత దారుణంగా రాజీపడతారా? గతంలో వ్యవసాయ చట్టాలు తెచ్చేందుకు యత్నిస్తే రైతులు తిరగబడ్డారు. ఇప్పుడు యువత తిరగబడుతున్నది. దేశాన్ని బీజేపీ సర్కార్ నాశనం పట్టిస్తున్నది. మోదీ సర్కార్పై అందరూ అప్రమత్తంగా ఉండాలి.
– సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి
ప్రధాని మోదీ చర్యలు దేశ భద్రతకు పెనుముప్పు. అగ్నిపథ్ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. అశాంతితో రగిలిపోతున్న యువతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. ప్రభుత్వరంగ సంస్థల మాదిరిగానే ఆర్మీని సైతం ప్రైవేటీకరించేందుకు మోదీ ప్రభుత్వం పావులు కదుపుతున్నది. జై కిసాన్-జై జవాన్ నినాదాన్ని మోదీ నీరుగారుస్తున్నారు. రైతులు, జవాన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.
-బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
కేంద్రం అగ్నిపథ్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మోదీ ప్రభుత్వం జై జవాన్-జై కిసాన్కు బదులుగా నై జవాన్-నై కిసాన్ అంటున్నది. రైల్వే వ్యవస్థ కేంద్రం ఆధీనంలో ఉంటుందన్న విషయం తెలిసి కూడా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సికింద్రాబాద్ ఘటనను రాష్ట్ర ప్రభుత్వ ఘటనగా చిత్రీకరించడం సిగ్గుచేటు. సికింద్రాబాద్ ఘటనకు బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్
అగ్నిపథ్ పథకం పేరిట దేశ ఆర్మీని ఆందోళనలోకి నెట్టిన ప్రధాని మోదీ, బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అగ్నిపథ్ పథకం దేశ ఆర్మీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. రిటైరైన వారికి పెన్షన్ తప్పించడం కోసం కేంద్రం చేసిన ఆనాలోచిత చర్య ఇది. దేశవ్యాప్త పోరాటాలు మోదీ ఆలోచనలపై దేశ యువత ఆగ్రహంతో ఉన్నదనడానికి నిదర్శనం. సికింద్రాబాద్ కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణించడం బాధాకరం.
-పల్లా రాజేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు
నల్ల చట్టాలతో రైతుల బతుకులను రోడ్లపాలు చేసిన బీజేపీ ప్రభుత్వం అగ్నిపథ్ పేరిట జవాన్ల బతుకులను బజారుకీడుస్తున్నది. కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
– జీవన్రెడ్డి, పీయూసీ చైర్మన్
ప్రధాని మోదీ అన్నింటా విఫలమయ్యారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను ఆథోగతి పాలుచేశారు. నల్ల చట్టాలతో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు.
-మన్నె క్రిషాంక్, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్
అగ్నిపథ్ వల్ల దేశ రక్షణ కోసం ప్రాణమైనా ఇచ్చేందుకు సిద్ధపడిన వారి జీవితాలకే భద్రత లేకుండా కేంద్రం చేస్తున్నది.
-బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు
ఆర్మీలో చేరిన యువతను నాలుగేండ్ల తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తే వాళ్లు ఎలా బతుకుతారు? బీజేపీ తీరు పక్కా 420 కంటే డబుల్ రీతిలో ఉన్నది.
– నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
కేంద్రం అగ్నిపథ్ను ఉపసంహరించుకోవాలి. సైనిక రిక్రూట్మెంట్ను పాతపద్ధతిలోనే కొనసాగించాలి. సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేశ్ కుటుంబానికి రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.
– ఎస్ నాగేశ్వరరావు, బోయిన్పల్లి రాములు, పీడీఎస్యూ
కేంద్రం అగ్నిపథ్ను తక్షణమే విరమించుకోవాలి. రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించినవారి కుటుంబానికి రూ.ఐదు కోట్ల నష్ట పరిహారం, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
-ఆర్ కృష్ణయ్య, ఎంపీ
దేశ రక్షణకు సంబంధించిన నియామకాలను కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టడం మంచిదికాదు. ఆర్మీ జవాన్లుగా ఎక్కువ శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు పనిచేస్తున్నారు. అగ్నిపథ్ ఆయా వర్గాల ఉద్యోగ భద్రతకు విఘాతం కలిగిస్తుంది.
-వంగపల్లి శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు