హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 13న నిర్వహించే ఎన్నికకు మొత్తం 137 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. జిల్లాల వారీగా మహబూబ్నగర్లో 15 పోలింగ్ స్టేషన్లు, నాగర్ కర్నూల్ 14, వనపర్తి 7, జోగులాంబ గద్వాల 11, నారాయణపేట్ 5, రంగారెడ్డి 31, వికారాబాద్ 18, మేడ్చల్ మలాజిగిరి 14, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేసినట్టు వివరించారు. మొత్తం 29,720 ఓటర్లుండగా, అందులో 15,472 మంది పురుషులు, 14,246 మంది స్త్రీలు, ఇతరులు 2 ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
నేడు సాయంత్రం ముగియనున్న ప్రచార పర్వం
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనున్నది. ఎన్నిక బరిలో ఉన్న 21 మంది అభ్యర్థులు 10 రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీచర్ల ఇంటింటికి వెళ్లి తమను గెలిపించాలని వేడుకొన్నారు. సాయంత్రం వేళ విందు సమావేశాలతో ఓటర్లను కొత్త హామీలతో ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికకు రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా, అభ్యర్థుల ప్రచారం మాత్రం వాడీవేడీగా సాగుతుండటం గమనార్హం.