హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): స్త్రీ నిధి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.135 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభం కంటే రూ.20 కోట్లు ఎక్కువని అధికారులు తేల్చారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలకు) నేరుగా రుణాలిచ్చేందుకు స్త్రీనిధి సహకార పరిపతి సంస్థను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ సంస్థ ఏటా ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లిస్తున్నది. కాగా, స్త్రీనిధి తరహా సంస్థను మేఘాలయలో ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నాడ్ సంగ్మా నిర్ణయించారు. తెలంగాణలో పర్యటించి స్త్రీనిధిపై అధ్యయనం చేసిరావాలని మేఘాలయ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎస్ఆర్ఎల్ఎం) అధికారులను ఆదేశించారు. దీంతో ఆ అధికారుల బృందం సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించింది. వారికి తొలి రోజు రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీలో అవగాహన కల్పించారు. స్త్రీనిధి కార్యకలాపాల గురించి ఉమ్మడి ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్రెడ్డి వివరించారు.
ఎస్ఆర్ఎల్ఎం అధికారులు జోనతన్ రాంబీ, పసంగ్ డీ ఖరింగ్, హేమిలిత జీ మేమిన్ తదితరులతో కూడిన మేఘాలయ బృందం మంగళవారం రంగారెడ్డి జిల్లా కందుకూరులో క్షేత్రస్థాయి పర్యటన జరిపింది. బుధవారం మరోసారి రాజేంద్రనగర్ టీఎస్ఐఆర్డీలో స్త్రీనిధి అధికారులతో సమావేశమైంది. తెలంగాణలో స్త్రీనిధి పనితీరును కేంద్ర ప్రభుత్వం మెచ్చుకొని, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా సంస్థల ఏర్పాటుకు సిఫారసు చేస్తున్నది. దీంతో ఇలాంటి సంస్థను ఇప్పటికే రాజస్థాన్లో ఏర్పాటు చేశారు. అందుకు తెలంగాణ స్త్రీనిధి సంస్థ పూర్తి సహకారాన్ని అందించింది. ఇదేవిధంగా బీహార్, ఒడిశాలో స్త్రీనిధి తరహా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆయా రాష్ర్టాల అధికారులు తెలంగాణలో అధ్యయనం చేసివెళ్లారు.