పర్వతగిరి/దేవరుప్పుల/తొర్రూరు, మార్చి 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు దాదాపు 1,300 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో నిర్వహించనున్న సభలో రాష్ట్రంలోని వేలాది స్వయం సహాయక సంఘాలకు రూ.750 కోట్లు విలువ గల వడ్డీ రాయితీ చెక్కులను మంత్రి కేటీఆర్ అందజేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది ఎస్హెచ్జీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దీంతోపాటు అభయహస్తం పథకం కింద 21,32,482 మంది మహిళలకు వారు చెల్లించిన డబ్బులకు వడ్డీతో సహా దాదాపు రూ.546 కోట్లు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఈ నెల 8న మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా ఏనుగల్లు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, జనగామ జిల్లా పాలకుర్తి, దేవరుప్పులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్న నేపథ్యంలో ఆయా సభల ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి సోమవారం సమీక్షించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ గోపితో కలిసి ఏనుగల్లులో హెలిప్యాడ్, సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం ఏనుగల్లులో ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటుచేయనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. వినోద్కుమార్ మాట్లాడుతూ.. తన తల్లి క్యాన్సర్ వ్యాధి బారిన పడి మృతిచెందారని, దీంతో ఆ రోజునే క్యాన్సర్ నుంచి మహిళలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేయాలని సంకల్పించామని తెలిపారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందించేందుకు ఏనుగల్లు గ్రామంలో క్యాంపును ఏర్పాటుచేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.