హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ 8 ఏరియాల్లో కొత్తగా 13 సోలార్ విద్యుత్తు ఉత్పాదన ప్లాంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ఆయా ప్లాంట్ల డీపీఆర్లపై సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సమీక్షించారు. బోర్డు సమావేశంలో ఆమోదించిన తర్వాత త్వరలో టెండర్లను పిలువనున్నట్టు తెలిపారు. మొదటి దశలో చేపట్టిన 300 మెగావాట్ల ప్లాంట్లలో ఇప్పటికే 224 మెగావాట్ల సామర్థ్యం గల 9 ప్లాంట్లు పూర్తయ్యాయి. వీటితో రూ.300 కోట్ల మేర కంపెనీకి ఆదా అవుతున్నది. మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్లు కూడా పూర్తయితే మొత్తం 450 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. రెండో దశలో 240 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఇవి పూర్తయితే మరో 360 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్త్తి అవుతుంది. మొత్తం 540 మెగావాట్లకు చేరడంతో పాటు 810 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. దీంతో సింగరేణి సోలార్ విద్యుత్తుపై నడిచే సంస్థగా, నెట్ జీరో ఎనర్జీ సంస్థగా అవతరిస్తుంది. సమావేశంలో సంస్థ ఉన్నతాధికారులు డీ సత్యనారాయణరావు, ఎస్కే సూర్, జేఎన్ సింగ్, డీవీఎస్ఎన్ రాజు, జానకిరామ్, సూర్యనారాయణ, ఎస్వీకేవీ రాజు, టీ సుధాకర్, కేఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.