హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షల్లో సోమవారం రికార్డుస్థాయిలో 13 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన తర్వాత ఇంత స్థాయిలో మాల్ప్రాక్టీస్ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. సంగారెడ్డి జిల్లాలో 11, నిజామాబాద్ జిల్లాలో 2 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.
సోమవారం ఫస్టియర్ విద్యార్థులకు గణితం పేపర్-1ఏ, బోటనీ పేపర్లకు పరీక్షలను నిర్వహించారు. మొత్తం 5,32,683 మంది విద్యార్థులకు గాను 5,09,194 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక 23,489 మంది విద్యార్థులు (4.4 శాతం) గైర్హాజరయ్యారు. పరీక్షకు అత్యధికంగా గైర్హాజరు కావడం ఇదే తొలిసారి. ఇంటర్మీడియట్ బోర్డు నియమించిన పరిశీలకులు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తనిఖీలు నిర్వహించారు.