హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): దృష్టి లోపాలతో బాధ పడుతున్న వారికి ‘కంటి వెలుగు’ చూపును ప్రసాదిస్తున్నది. పల్లె నుంచి పట్టణం వరకు లక్షల మంది బతుకుల్లో కాంతులు నింపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు-2’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కంటి వెలుగును ప్రారంభించగా, 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. 2018లో నిర్వహించిన కంటి వెలుగు మొదటి దశ కార్యక్రమంలో రాష్ట్రం అత్యుత్తమ ట్రాక్ రికార్డును సాధించింది. తొలివిడత కంటి వెలుగులో దాదాపు 1.57 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయగా, 45 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. మన రికార్డును మనమే మళ్లీ బ్రేక్ చేయాలని సీఎం కేసీఆర్ సూచించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. జిల్లా అధికారులు క్యాంపుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో ఎకడా ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. వైద్య శిబిరాల్లో నాణ్యమైన వైద్య సేవలందించడంతో కంటి వెలుగు కార్యక్రమానికి భారీ స్పందన వస్తున్నది.
ఆరు రోజులు.. 12,79,637 కంటి పరీక్షలు
కంటి వెలుగు-2 ప్రారంభమైన ఆరో రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12,79,637 మందికి కంటి పరీక్షలు చేశారు. 2,94,224 మందికి ఉచితంగా అద్దాలు ఇచ్చారు. 5,88,583 మంది పురుషులకు పరీక్షలు చేసి, 1,01,771 మందికి అద్దాలు అందజేశారు. 6,79,892 మంది మహిళలకు పరీక్షలు చేసి, 1,15,300 మందికి అద్దాలు ఇచ్చారు. 625 మంది ట్రాన్స్జెండర్లకు పరీక్షలు చేయగా, 72 మందికి అద్దాలు అవసరమని అందజేశారు.
వంద రోజుల్లో కోటిన్నర మందికి..
వందరోజుల్లో కోటిన్నర మందికి పైగా కంటి పరీక్షలు చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,500 వైద్య బృందాలు పని చేస్తున్నాయి. ఈ కార్యక్రమం వారంలో ఐదు రోజులు(శని, ఆదివారాలు మినహా) నిర్వహిస్తున్నారు.
16,556 వైద్య శిబిరాలు..
శిబిరానికి వచ్చిన ప్రతి వ్యక్తి వివరాలను డీఈవో, ఏఎన్ఎంలు ట్యాబ్ల ద్వారా ఎప్పటికప్పుడు డేటా నమోదు చేస్తున్నారు. దూరదృష్టి, దగ్గరి దృష్టికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. కంట్లో శుక్లాలు ఉన్నాయా? ఇన్ఫెక్షన్లు ఉన్నాయా? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ శుక్లాలు ఉంటే ఆప్టోమెట్రిస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటరైజ్డ్ పరీక్షలు చేస్తున్నారు. సాధారణ దృష్టి లోపాలను గుర్తిస్తే అకడికకడే రీడింగ్ గ్లాసెస్ ఇస్తున్నారు. ముందస్తుగానే 20 లక్షల కంటి అద్దాలు సిద్ధం చేసి పెట్టడంతో ఎక్కడా అద్దాల కొరత రావడం లేదు. జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 16,556 ప్రదేశాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో 12,768, పట్టణ ప్రాంతాల్లో 3,788 శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. వైద్య శిబిరాల నిర్వహణపై ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, మీడియా సంస్థల ఆఫీసుల్లో, పోలీస్ బెటాలియన్లలో కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
కేసీఆర్ సార్ దయతో సూపొచ్చింది..
కండ్లు సరిగా కనిపించవు. ఇది ఇప్పటి బాధ కాదు. చాలా రోజుల సంది ఇదే ఇబ్బంది. ప్రయివేటు దవాఖానకు పోదామంటే పైసలు లేవాయే. చివరికి ఇంట్లో పని చేసుకోవడానికి కూడా కష్టమే అయ్యేది. మా దగ్గర అంబేద్కర్నగర్లో కేసీఆర్ సార్ అందరికీ ఉచితంగానే కండ్ల అద్దాలు ఇస్తున్నరని తెలిసింది. శిబిరానికి పోయి కండ్లు చూయించుకున్న. డాక్టర్లు చూసి అద్దాలిచ్చిన్రు. ఇప్పుడు సూపు మంచిగైంది. సీఎం కేసీఆర్ సార్ దయతో నాలాంటోళ్లు ఎందరికో సూపొచ్చింది.
-గడ్డం విజయ, అంబేదర్నగర్, సిరిసిల్ల