Adilabad | ఆదిలాబాద్, మే 6(నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం రంగం రూపురేఖలు మారిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో చుక్క నీటి కోసం ఇబ్బందులు పడిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, చెరువులు, చెక్డ్యాంల నిర్మాణం, మరమ్మతులు చేపట్టి రెండు పంటలకు సరిపడా సాగునీటిని అందిస్తున్నది. ఇందులో భాగంగానే.. ఆదిలాబాద్ జిల్లాలో మత్తడి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడానికి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టుంది. కాలువల పద్ధతి కాకుండా.. పైప్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నది. రూ.7.34 కోట్లతో 9 కిలోమీటర్ల మేర పైప్లైన్ వేశారు. ప్రాజెక్టు పనులు పూర్తయ్యి ట్రయల్ రన్కు సిద్ధమైనది.
1,200 ఎకరాలు.. 9 కిలోమీటర్ల పైప్లైన్
ఉమ్మడి రాష్ట్రంలో తాంసి మండలం వడ్డాడి వద్ద 2005లో రూ.54 కోట్లతో అప్పటి ప్రభుత్వం మత్తడి వాగు ప్రాజెక్టు నిర్మించింది. ఎడమ కాలువను పూర్తి చేసి కుడి కాలువను వదిలేసింది. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం 2017లో రూ.7.34 కోట్లతో కుడి కాలువ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ కాలువ ద్వారా తాంసి మండలం హుస్నాపూర్, వడ్డాడి, తలమడుగు మండలం ఖోడద్, ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర గ్రామాల్లోని 1200 ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు అధికారులు 9 కిలోమీటర్ల పైప్లైన్ వేశారు. రైతుల భూముల్లో పైపులు వేయడానికి 3 నుంచి 4 మీటర్లు తవ్వి పనులు పూర్తయిన తర్వాత పూడ్చేశారు.
దీంతో రైతులకు పంటలు సాగు చేసుకోవడానికి ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక నీటిని సరఫరా చేయడానికి ప్రాజెక్టు సమీపంలో నిర్మించిన పంప్హౌస్లో 75 హెచ్పీ సామర్థ్యం కలిగిన నాలుగు మోటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి స్టాండ్బైగా ఉంటుంది. ఇందుకోసం అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచారు. మోటర్ల దగ్గర 450 మిల్లీ మీటర్ల వ్యాసం ఉండే పైపులైన్, తర్వాత 350 మిల్లీ మీటర్ల పైప్లైన్, ఆ తర్వాత 280 మిల్లీ మీటర్లు, చివరన 90 మిల్లీ మీటర్ల పైపులు వేశారు. మొత్తం 25 బ్లాకులుగా విభజించి 225 అవుట్లెట్లు అమర్చారు. ఒక్కో అవుట్లెట్ ద్వారా 2.5 హెక్టార్లకు సాగునీరు అందనుంది. ఈ విధానం ద్వారా భూసేకరణ, నీటి వృథా సమస్యలు ఉండవని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు.
త్వరలో ట్రయల్ రన్
మత్తడి వాగు ప్రాజెక్టు కుడి కాలువ నిర్మాణంలో రాష్ట్రంలో తొలిసారిగా పైప్లైన్ విధానాన్ని అమలు చేశాం. పైప్లైన్, అవుట్లెట్ల పనులు పూర్తయ్యాయి. మూడు 75 హెచ్పీ మోటర్ల ద్వారా రైతుల పంటలకు సాగునీరు అందనుంది. త్వరలో ట్రయల్ రన్ నిర్వహిస్తాం. తక్కువ ఖర్చుతో ఎలాంటి లీకేజీలు లేకుండా చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతుంది.
– హరీశ్కుమార్, ఏఈ, మత్తడి ప్రాజెక్టు