హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏటేటా తన ఆర్థిక లక్ష్యాలను పొడిగించుకొంటున్నది. జీఎస్టీ రూపంలో సామాన్యుడిపై భారీగా పన్నుల భారాన్ని మోపి అందినకాడికి దండుకొంటున్నది. రాష్ర్టాలకు మాత్రం నిబంధనల పేరుతో ఉచ్చు బిగిస్తున్నది. న్యాయబద్ధంగా రాష్ర్టాలకు దక్కాల్సిన వాటాలను కేంద్ర ఖజానాకు మళ్లించుకుంటూ రాష్ర్టాలను ఆర్థికంగా అస్థిర పరిచేందుకు యత్నిస్తున్నది. అందులో భాగంగా పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి కొల్లగొడుతున్నది. రాష్ర్టాలకు తగినన్ని నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపుతున్నది. ఈ నేపథ్యంలో సెస్సులు, సర్చార్జీలను తగ్గించాలని తెలంగాణ సహా అనేక రాష్ర్టాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటిని కేంద్రం పెడచెవిన పెడుతూ తన రాబడులను ఏటికేడు రెట్టింపు చేసుకొంటున్నది. కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం స్థూల పన్ను రాబడి (జీటీఆర్)లో సెస్, సర్చార్జీల వసూళ్లు 2016-17తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 120% పెరిగాయి.
రాష్ర్టాల ఆదాయానికి గండి
మోదీ ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత పెట్రోల్, డీజిల్పై సెస్సును అమాంతం పెంచేశారు. లీటర్ పెట్రోల్పై రూ.2.50, డీజిల్పై రూ.4 చొప్పున పన్ను తగ్గించి, ఆ మేరకు సెస్సు పెంచారు. దీంతో రాష్ర్టాలకు లీటర్ పెట్రోల్పై రూ.1.03, డీజిల్పై రూ.1.64 చొప్పున ఆదాయం తగ్గింది. ఇతర పన్నులను కూడా సెస్సులుగా మార్చడంతో కేంద్ర ప్రభుత్వ రాబడి గత ఏడేండ్లలో రెట్టింపు కంటే అధికమైంది. 2016-17 నాటికి జీటీఆర్లో 12% (రూ. 2,31,060 కోట్లు)గా ఉన్న సెస్సులు, సర్చార్జీలు 2021-22లో రూ.4,25,650 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.3,88,982 కోట్లకు (జీటీఆర్లో 28.1 శాతానికి) పెరుగుతాయని బడ్జెట్లో కేంద్రం అంచనా వేసింది.
దారి మళ్లుతున్న నిధులు
ప్రజలు చెల్లిస్తున్న అన్ని పన్నులకు అదనంగా వివిధ రంగాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేకంగా వసూలు చేస్తున్న పన్నునే సెస్ అంటారు. ఏ రంగం అభివృద్ధికి విధించిన సెస్సును ఆ రంగానికే వెచ్చించాలి. కానీ మోదీ సర్కారు సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. విద్య, వైద్యం లాంటి కీలక రంగాల అభివృద్ధి కోసం వసూలు చేసిన సెస్సును ఆ పనులకు ఉపయోగించడం లేదని విమర్శిస్తున్నాయి. అయితే రాష్ర్టాల నుంచి కేంద్రానికి వస్తున్న సెస్సులు, సర్చార్జీల కంటే రాష్ర్టాల కోసం కేంద్రమే ఎక్కువ ఖర్చు చేస్తున్నదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్లో చెప్పారు. కానీ, ఇదంతా అబద్ధమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తేల్చింది. విద్య, వైద్య రంగాల అభివృద్ధి కోసం వసూలు చేసిన సెస్సును మాధ్యమిక్ అండ్ ఉచ్చతర్ శిక్షా కోష్ (మస్క్) అభివృద్ధికి ఖర్చు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం 2017లోనే ఆమోదం తెలిపినా ఈ సెస్సు నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్క రూపాయి కూడా ‘మస్క్’కు ఖర్చు చేయలేదని కాగ్ స్పష్టం చేసింది.