హైదరాబాద్, డిసెంబర్13 (నమస్తే తెలంగాణ): మాదిగలకు చట్టసభల్లో 12శాతం రిజర్వేషన్ కల్పించాలని మాదిగల జేఏసీ వ్యవస్థాపకుడు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సోమవారం మాదిగ జేఏసీ నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ.. ఎస్సీలను వర్గీకరించే అధికారాన్ని రాష్ర్టాలకు కట్టబెడుతూ పార్లమెంట్లో వెంటనే చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాదిగ జేఏసీ నేతలు కొడారి ధిరన్, గడ్డ యాదయ్య, ఉపేందర్, బాలరాజు, రాయికంటి రాందాస్, పరమేశ్వర్, గద్దల నాగేశ్వరావు, సుదర్శన్, తిరుమలరావు, అంబాల మురళి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం కూడా మాదిగల దీక్ష కొనసాగనుందని జేఏసీ నాయకులు చెప్పారు.