ఖమ్మం, జనవరి 24 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కల్యాణలక్ష్మి ద్వారా 12 లక్షల మందికి రూ.12 వేల కోట్ల విలువైన చెక్కులను ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటివరకు 7,606 మందికి చెక్కులు ఇచ్చినట్టు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా తాజాగా 92 మందికి మంజూరైన రూ.92 లక్షల విలువైన చెక్కులను మంగళవారం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆత్మీయ విందు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.