నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 29: ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాణహిత నుంచి వస్తున్న నీటిని కలుపుకొని గోదావరి ఉధృతంగా మారింది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద 10 లక్షల క్యూసెక్కులతో 12.6 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. పుష్కరఘాట్లను దాటుకొని పా ర్కింగ్ స్థలం వరకూ చేరుకున్నది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసింది. భక్తులెవరూ గోదావరిలోకి వెళ్లొద్దని బోర్డులు ఏర్పాటుచేయడంతోపాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ములుగు జిల్లా వాజేడు వద్ద 13.110 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నది. వరద టేకులగూడెం వద్ద హైదరాబాద్-భూపాలపట్నం 163వ జాతీయ రహదారిపైకి పోటెత్తింది. దీంతో తెలంగాణ-ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. బుధవారం దాదాపు 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 33 వరద గేట్ల ద్వారా 4.49 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 75.85 టీఎంసీల (90.313 టీఎంసీలు) నీరున్నది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 57 వేల ఇన్ఫ్లో, 74,200 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 13.96 టీఎంసీలు (17.80 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ పరిధిలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులో 27.148 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, క్రస్ట్ గేట్ల ద్వారా 62,104 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 6.58 లక్షల ఇన్ఫ్లో ఉండగా అంతేస్థాయిలో అవుట్ఫ్లో నమోదవుతున్నది.
కృష్ణా బేసిన్లోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. లక్షన్నర క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.132 టీఎంసీలు నిల్వ ఉన్నది. శ్రీశైలం జలాశయానికి 64,950 క్యూసెక్కుల వరద వస్తుందగా, ఏపీ పవర్ హౌస్కు 31,046 క్యూసెక్కులు, టీఎస్ పవర్హౌస్కు 31,784 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 882.20 అడుగుల వద్ద నీటి నిల్వ ఉన్నది. నాగార్జునసాగర్కు 70,981 క్యూసెక్కుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో నమోదవుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు ప్రస్తుతం 589.90 (311.7464 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. మూసీ ప్రాజెక్టుకు 17 వేల క్యూసెక్కుల వరద చేరుతుండటంతో 6 క్రస్టు గేట్ల ద్వారా 16 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.