హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నది. బుధవారం చలి ఒక్కసారిగా మరింత పెరిగింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుని, నెలాఖరుకు మళ్లీ పెరుగుతుందని పేర్కొన్నది. చలికి తోడు చలిగాలులు కూడా వీస్తాయని, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12-13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్లో అత్యంత కనిష్ఠంగా 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, మెదక్లో 12.8, పటాన్చెరులో 13.2, ఆదిలాబాద్లో 13.7, హకీంపేటలో 14.5, హనుమకొండలో 15, దుండిగల్లో 15.7, రామగుండంలో 14.6, నిజామాబాద్లో 16.1, హైదరాబాద్లో 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో 17, మహబూబ్నగర్లో 18.5, భద్రాచలంలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. చలి గాలుల వల్ల అనారోగ్యం బారిన పడకుండా దుస్తులు, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.