హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ. 41,259 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందుతుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ఆర్థికశాఖ చివరికి రూ.4,532 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 11 శాతం మాత్రమే. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటాలు ఇవ్వక రాష్ర్టాన్ని ఇబ్బంది పెడుతున్న మోదీ ప్రభుత్వం గ్రాంట్ విషయంలోనూ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను స్వయంగా ‘కాగ్’ కూడా తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ రాష్ర్టానికి ఒక్క రూపాయి కూడా విదిలించని కేంద్రం, మేలో మాత్రం రూ.1,438.61 కోట్లు మంజూరు చేసింది. జూన్లో రూ.372.91 కోట్లు, జూలైలో రూ.506.3 కోట్లు, ఆగస్టులో రూ.691.44 కోట్లు, సెప్టెంబర్లో రూ.610.18 కోట్లు, అక్టోబర్లో రూ.216.47 కోట్లు, నవంబర్లో రూ.696.83 కోట్లు అందించింది. మొదటి 8 నెలల్లో ఒక్కో నెలకు సగటున బడ్జెట్ అంచనాల్లో 1.4 శాతం గ్రాంట్ మాత్రమే ఇచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే మిగిలిన డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి మొత్తంగా మరో ఐదారు శాతం మాత్రమే గ్రాంట్ వచ్చే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో 18 నుంచి 20 శాతంలోపే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందే అవకాశం ఉన్నది.
బీజేపీ పాలిత రాష్ర్టాలకు అంచనాలకు మించి
గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం బడ్జెట్ పద్దుతో సంబంధం లేకుండా గ్రాంట్ విడుదల చేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు నవంబర్ నాటికే అంచనాల్లో 102 శాతం గ్రాంట్ ఇచ్చేసింది. కేంద్రం నుంచి రూ.16,290.35 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందుతుందని గుజరాత్ భావిస్తే 8 నెలల్లోనే ఆ మొత్తాన్ని దాటేసి రూ. 16,582.02 కోట్ల గ్రాంట్ అందించింది. అంటే ఇది ఆ రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో 101.79 శాతం. అదే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం 11 శాతంతో సరిపెట్టింది. బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్కు 101.79 శాతం, హర్యానాకు 59.57 శాతం, త్రిపురకు 45.12 శాతం, మధ్యప్రదేశ్కు 44.10 శాతం, ఉత్తరాఖండ్కు 39.23 శాతం, ఛత్తీస్గఢ్కు 33.46 శాతం, రాజస్థాన్కు 28.74 శాతం, ఉత్తర ప్రదేశ్కు 26.06 శాతం, మహారాష్ట్రకు 19.59 శాతం గ్రాంట్ను విడుదల చేసింది. మణిపూర్ ఆగస్టు వరకు, అరుణాచల్ప్రదేశ్ సెప్టెంబర్ వరకు మాత్రమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్కు వివరాలు సమర్పించాయి. గోవా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎటువంటి సమాచారాన్ని కాగ్కు సమర్పించలేదు. దేశంలోని మిగిలిన రాష్ర్టాలన్నీ కాగ్కు వివరాలు అందించగా, ఈ మూడు రాష్ర్టాలు మాత్రమే సమయానికి ఎందుకు వివరాలు సమర్పించడం లేదన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు కేంద్రం నుంచి అందిన గ్రాంట్
బీజేపీ పాలిత రాష్ర్టాలకు నవంబర్ వరకు అందిన గ్రాంట్ (రూ. కోట్లలో)