చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి వద్ద విజయవాడ జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సును గుండ్లబావి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల్లో 11 మందికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.