హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): దేశంలో వ్యవసాయం సహా అన్ని రంగాలకూ నిరంతరం 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం ఏది? అన్న ప్రశ్నకు ఠక్కున వచ్చే సమాధానం తెలంగాణే. కానీ.. ఇంతటి మహత్తర సేవలందిస్తున్న తెలంగాణలోని విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లకు కేంద్రం ఎలాంటి చేయూతనూ ఇవ్వడం లేదు. పైపెచ్చు అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలోని డిస్కంలపై తలకుమించిన భారాన్ని మోపుతున్నది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. సమాజంలోని బడుగు వర్గాలకు ఇస్తున్న సబ్సిడీల వల్ల భారం పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేండ్ల నుంచి విద్యుత్ చార్జీలను పెంచలేదు. దీనికితోడు కొవిడ్ కారణంగా రూ.4,374 కోట్ల విద్యుత్తు బిల్లుల వసూలు నిలిచిపోవడంతో డిస్కంలు తీవ్ర ఆర్థిక భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు సోమ, మంగళవారాల్లో విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో డిస్కంలపై పడుతున్న ప్రభావం గురించి లోతుగా చర్చించారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం బాదుడును తట్టుకొని విద్యుత్తు సంస్థలు నిలబడాలంటే చార్జీలను సవరించక తప్పదని వారు విస్పష్టంగా చెప్పినట్టు తెలుస్తున్నది.
పెరిగిన బొగ్గు ధరలు, రవాణా చార్జీలు
థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి తెలంగాణ డిస్కంలు ఏటా 50 వేల మిలియన్ యూనిట్లను కొనుగోలు చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం బొగ్గు ధరలను సాలీనా 6% నుంచి 10% వరకు పెంచుతుండటంతో డిస్కంలపై ఏటా అదనంగా రూ.725 కోట్ల భారం పడుతున్నది. థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు రవాణాలో రైల్వేలే కీలకం. దీన్ని మోదీ సర్కారు ఏమాత్రం పట్టించుకోకుండా రైల్వేల్లో బొగ్గు రవాణా చార్జీలను గత నాలుగేండ్లలోనే 40% పెంచింది. ఈ భారాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక డిస్కంలు తల్లడిల్లుతున్నాయి. మరోవైపు విద్యుత్తు సంస్కరణల పేరిట కేంద్రం రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (ఆర్పీపీవో) పాలసీని తప్పనిసరి చేయడం తెలంగాణలోని విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (జెన్కో)ల పీఎల్ఎఫ్పై పెను ప్రభావం చూపింది.
పీపీఏల రద్దుతో చావుదెబ్బ
రాష్ట్ర విభజన సమయంలో సీలేరు, కృష్ణపట్నం విద్యుత్తు కేంద్రాల పీపీఏలను ఏకపక్షంగా రద్దుచేయడంతో తెలంగాణలోని విద్యుత్తు సంస్థలపై అదనపు భారం పడింది. ఈ లోటును పూడ్చుకొనేందుకు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేయడం వల్ల తెలంగాణ సంస్థలు రూ.2,763 కోట్ల అదనపు భారాన్ని మోయాల్సి వస్తున్నది. దీనికితోడు ఏపీలోని జెన్కోల నుంచి రావాల్సిన విద్యుత్తును నిలిపివేయడంతో తెలంగాణ సంస్థలు 2,502 కోట్లు అదనంగా భరించాల్సి వచ్చింది. ఇలా మోదీ సర్కారు దెబ్బ మీద దెబ్బ కొట్టినా కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడా రాజీపడకుండా అన్ని వర్గాల వినియోగదారులకు సబ్సిడీతో నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నది.
వ్యవసాయ భారం
దేశంలో వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటలూ విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక్కో పంప్సెట్కు రూ.18,167 సబ్సిడీ ఇస్తున్నది. స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికే తెలంగాణలో 19.03 లక్షల వ్యవసాయ మోటర్ కనెక్షన్లు ఉన్నాయి. గత ఏడేండ్లలో ఇవి మరో 6.89 లక్షల వరకు పెరిగాయి. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3,375 కోట్లు ఖర్చు చేసింది. దీనితోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.3,200 కోట్లు ఖర్చు పెడుతున్నది.
వివిధ వర్గాలకు సబ్సిడీలు
తెలంగాణలో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించే గృహ వినియోగదారులందరికీ సబ్సిడీ రూపంలో రాష్ట్రం ఏటా రూ.1,253 కోట్లు చెల్లిస్తున్నది. 101 యూనిట్లలోపు విద్యుత్తును ఉపయోగించుకొనే ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు పూర్తి ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది. ఈ పథకం ద్వారా 5,77,100 మంది ఎస్సీలు, 2,69,983 మంది ఎస్టీలు లబ్ధి పొందుతున్నారు. 15,046 సెలూన్లు, 50 దోబీ ఘాట్లు, 47,545 లాండ్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి యూనిట్పై రూ.2 సబ్సిడీతో 4,920 పవర్లూమ్లకు, 5,920 పౌల్ట్రీలకు, 36 స్పిన్నింగ్ మిల్లులకు విద్యుత్తును అందిస్తున్నది.
ఆదిలోనే రూ.12,185 కోట్ల నష్టాలు..
2014లో స్వరాష్ట్రంగా ఏర్పడేనాటికే తెలంగాణ డిస్కంలు రూ.12,185 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఈ భారాన్ని తగ్గించాల్సిన కేంద్రం ఇష్టారీతిగా నిర్ణయాలు తీసుకోవడం డిస్కంల పాలిట పెను శాపంగా మారింది. చిమ్మచీకట్లలో ఏర్పాటైన తెలంగాణలో వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమించిన కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం నిర్ణయాలు ప్రతిబంధకాలవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 6 నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు నిరంతరాయంగా 24 గంటలూ విద్యుత్తును అందించిన తెలంగాణకు కేంద్రం విద్యుత్తు సంస్కరణల పేరుతో షాక్ల మీద షాక్లు ఇస్తున్నది.
గ్రీన్ ఎనర్జీ సెస్ పేరిట 7,200 కోట్ల బాదుడు
గ్రీన్ ఎనర్జీ పేరుతో కేంద్రం బొగ్గుపై క్లీన్ ఎనర్జీ సెస్ను భారీగా పెంచింది. 2010లో టన్నుకు రూ.50 వరకు ఉన్న ఈ సెస్ను ఎకాఎకిన రూ.400కు పెంచింది. తద్వారా గత ఏడేండ్లలో రాష్ట్రంపై రూ.7,200 కోట్ల అదనపు భారం మోపింది. ఈ ప్రభావం అంతిమంగా డిస్కంలపై పడింది.