Subsidy | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాయితీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద దాదాపు రూ.2,500 కోట్ల సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు సంబంధించిన టీ-ప్రైడ్ రాయితీలే రూ.1,000 కోట్ల వరకు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రాయితీలన్నీ నిలిచిపోవడంతో ఆయా లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు రుణాలు తీర్చలేక సతమతమవుతున్న తమకు రాయితీలు కూడా నిలిచిపోవడంతో సకాలంలో కరెంటు బిల్లులు, లేబర్ చార్జీలు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సబ్సిడీలన్నీ విడుదల చేయాలని కోరుతున్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది.
పారిశ్రామిక అనుమతులను సులభతరం చేసేందుకు టీఎస్-ఐపాస్ పేరుతో సింగిల్ విండో విధానాన్ని అమలు చేయడంతోపాటు టీ-ప్రైడ్ ద్వారా దళిత, గిరిజన, వికలాంగులకు, టీ-ఐడియా ద్వారా జనరల్ క్యాటగిరీ వారికి అనేక రాయితీలను అందించింది. ఇందుకోసం 2014-15 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు రూ.6,837 కోట్లు విడుదల చేయడంతో దాదాపు 90 వేల మంది లబ్ధిపొందారు. ఇదికాకుండా విద్యుత్తు సబ్సిడీ, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా సుమారు రూ.9,500 కోట్ల వరకూ ప్రోత్సాహకాలను అందించిన కేసీఆర్ ప్రభుత్వం.. 2023-24 వార్షిక బడ్జెట్లో వాణిజ్య, పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు కేటాయించింది. అందులో వివిధ రాయితీలకే రూ.3,519 కోట్లు నిర్దేశించింది. కానీ, ప్రస్తుతం ప్రతి పనికీ నిధుల కొరత ఉన్నదని చెప్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. గతంలో పరిశ్రమలకు అందించిన ప్రోత్సాహకాలను కొనసాగిస్తుందా? లేదా? అన్న దానిపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.