హైదరాబాద్, మార్చి 23 (నమస్తేతెలంగాణ): ‘యంగ్ ఇండియా స్కూల్స్ టెండర్లలో వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల నియోజకవర్గాల వరకు 4.56 శాతం నుంచి 4.96 వరకు ఎక్సెస్కు ఖరారు కావడమే ఇందుకు నిదర్శనం’ అంటూ హరీశ్రావు ఆధారాలు చూపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో 105 స్కూల్స్ నిర్మిస్తున్నామని గొప్పగా చెప్పి 76 మాత్రమే మంజూరు చేశారని, అధికార, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విస్మరించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. స్కూల్స్ టెండర్లలో గోల్మాల్పై సిట్ లేదా ఏసీబీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
ఆరు గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీలతో కూడిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో అభయహస్తం కాదని, మోసాల పుట్ట అని హరీశ్ అభివర్ణించారు. ‘ఎస్సీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రాధాన్యమిచ్చింది..2014-15లో రూ. 1,396 కోట్లు కేటాయించగా, 2023-24 వరకు రూ. 4,703 కోట్లకు పెంచినం..2021-22లో గరిష్ఠంగా రూ. 7,361 కోట్లు వెచ్చించినం..కానీ కాంగ్రెస్ సర్కార్ 2024-25 బడ్జెట్లో కేవలం రూ. 1,395 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇదీ బీఆర్ఎస్ మొదటి బడ్జెట్లో చేసినదాని కంటే తక్కువ’ అని వివరించారు. ‘ఎస్సీ సంక్షేమానికి 2024-25లో 33, 124 కోట్లు కేటాయించి, ఖర్చు కేవలం రూ.14,148 కోట్లు మాత్రమే (42 శాతం), 2025-26లో రూ.40,231 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం రూ, 14,732 కోట్లు మాత్రమే..ఈ గణంకాలే కాంగ్రెస్ దళిత ద్రోహానికి మచ్చు తునక’ అని స్పష్టంచేశారు.
ఇక ఎస్సీ కార్పొరేషన్కు రూ, 3,267 కోట్లు కేటాయించి కేవలం రూ. 28 కోట్లే ఖర్చుచేయడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. కేసీఆర్పై కక్షతో దళితబంధుకు కాంగ్రెస్ దళితబంధుకు దోఖా చేసిందని ధ్వజమెత్తారు. అభయహస్తం పేరిట రూ. 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. ఓ వైపు బడ్జెట్లో కోతలు పెడుతూ దళితులను వంచిస్తున్న సర్కార్ మరోవైపు రెండేండ్లలో 50 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నదని, ఒక చేత్తో కోతలు పెడుతూ మరో చేత్తో భూ మేతకు పాల్పడుతున్నదని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలను సైతం కాంగ్రెస్ దారుణంగా వంచిందని హరీశ్ భగ్గుమన్నారు. 2014-15లో రూ.1,090 కోట్లు ఉన్న ఖర్చును 2023-24కు రూ.4 వేల కోట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ది అని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ 2024-25కు గానూ రూ.3,067 కోట్లకు తగ్గించిందని చెప్పారు. ‘కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామన్నరు.. బీసీ సబ్ప్లాన్ తెస్తమన్నరు.. 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తమన్నరు.. కానీ మూడో బడ్జెట్లోనూ మొండిచెయ్యి చూపారు’ అని మండిపడ్డారు.
గద్దెనెక్కిన వెంటనే చేయూత కింద పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి అమల్లో కాంగ్రెస్ మొండిచెయ్యి చూపిందని హరీశ్ ధ్వజమెత్తారు. కేవలం పాత పద్దులే కేటాయించి 43 లక్షల మంది లబ్ధిదారుల ఆశలపై నీళ్లు కుమ్మరించిందని విమర్శించారు. పింఛన్ల పెంపు మాటేమిటో గానీ 3 లక్షల మంది లబ్ధిదారులకు కోతలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కో లబ్ధిదారుకు రూ. 54 వేలు బాకీ పడ్డదని చెప్పారు. ఆర్టీసీకీ మహాలక్ష్మీ కింద రూ.2,800 కోట్లు బకాయిపడ్డదని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ గెజిట్ జారీ చేశామని, కానీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.
నమ్మి ఓటేసిన పాపానికి 45 లక్షల మంది మైనారిటీలకు కాంగ్రెస్ సర్కార్ ధోకా చేస్తున్నదని హరీశ్ మండిపడ్డారు. మైనారిటీ సబ్ప్లాన్ అమలు చేసి ఏటా రూ.4 వేల కోట్లు ఇస్తామని చెప్పి ఆచరణలో విఫలమైందని విమర్శించారు. ‘2025-26 బడ్జెట్లో రూ.3,590 కోట్లు కేటాయించి, రూ.1,591 కోట్లే ఖర్చుచేసి సగానికి సగం కోతపెట్టారు. 2024-25లో కేవలం 53 శాతం నిధులే ఖర్చుచేశారు’ అని ఎత్తిచూపారు. కేసీఆర్ పాలనలో 75 శాతానికి పైగా నిధులు ఖర్చుచేశామని గుర్తుచేశారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కువై పోయి ఇక నోటిఫికేషన్లు చాలంటున్నరని భట్టి సెలవిస్తున్నరు. ఒక పావుగంట హౌస్ ఎడ్జర్న్ చేయండి. అందరం అశోక్నగర్ పోయి అడుగుదాం.. నిరుద్యోగులు ఉద్యోగాలు చాలు అంటున్నరా? మీరిచ్చిన ఉద్యోగాలతో సంతృప్తి చెందారా? తెలుసుకుందాం.. ఎందుకు ఇలా నిరుద్యోగులను వంచిస్తున్నరు?
-హరీశ్రావు
ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అశోక్నగర్ చౌరస్తా సాక్షిగా నిట్టనిలువునా ముంచిందని హరీశ్ విరుచుకుపడ్డారు. ‘యువ వికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్నా రూ. 5లక్షల భరోసా కార్డు పత్తాలేదు..విద్యార్థినులకు ఇస్తామన్నా స్కూటీల ముచ్చటేలేదు’అని తూర్పారబట్టారు.
ఆరు గ్యారెంటీలను అటకెక్కించి మహాలక్ష్ములను కాంగ్రెస్ మాయచేస్తున్నదని హరీశ్ విమర్శించారు. ‘ఆడబిడ్డలకు ఇస్తామన్న రూ.2,500 స్కీమ్కు అతీగతీలేదు. వడ్డీలేని రుణాల ప్రస్తావనే లేదు. లక్ష కోట్ల మాట ముచ్చటేలేదు. తులంబంగారం ఊసేలేదు..అంగన్వాడీ, ఆశ కార్యకర్తల వేతనాల పెంపులేదు’ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో పెరిగిందల్లా కడుపుకోతలు, మహిళలపై క్రైమ్ రేటేనని విమర్శించారు.
ఇక గిరిజనులపై సర్కార్ ఒలకబోస్తున్న ప్రేమ వట్టి బూటకమనే విషయం బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు చూస్తే అర్థమవుతుందని హరీశ్ ధ్వజమెత్తారు. 2014-15లో రూ.746 కోట్లు ఉన్న ఖర్చును 2023-24 నాటికి రూ. 2,359 కోట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ది అయితే..2024-25లో రూ. 1,746 కోట్లకు తగ్గించిన ఘనత కాంగ్రెస్ది అని విరుచుకుపడ్డారు. ‘2024-25లో గిరిజన సంక్షేమానికి బడ్జెట్లో రూ. 17,056 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పి ఖర్చు చేసింది మాత్రం రూ, 9,773 కోట్లు (50 శాతం) మాత్రమే, గిరిజన విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్కు రూ.65 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం రూ.1.79 కోట్లు మాత్రమే, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు రూ.53 కోట్లు కేటాయించి వెచ్చించింది కేవలం రూ.5 కోట్లే..అక్షరాలా రూ.1,750 కోట్లు గిరిజన పిల్లల చదువుల మీద కోత పెట్టింది. కానీ 2026-27 బడ్జెట్లో రూ. 18,745 కోట్లు ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నది’ అని నిప్పులు చెరిగారు.
ఏఐ మార్ఫింగ్ ఫొటోలు ముద్రించి సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ సర్వే పుస్తకం విశ్వసనీయతను కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీయడం దుర్మార్గమని హరీశ్ మండిపడ్డారు. ‘ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ జెర్సీ ధరించి సీఎం రేవంత్రెడ్డితో ఫుట్బాల్ ఆడిండ్రా? కానీ సోషియో ఎకనామిక్ సర్వే పుస్తకంలో జెర్సీతో ఆడుతున్నట్టుగా ఫొటో పెట్టుకున్నరు’ అంటూ ఒరిజినల్, మార్ఫింగ్ ఫొటోలను చూపుతూ కాంగ్రెస్ సర్కార్ ఏఐ వ్యవహారాన్ని అసెంబ్లీ సాక్షిగా హరీశ్ బట్టబయలు చేశారు. ‘ఫ్యూచరిస్టిక్ అంటే ఇట్లా అనుకోలే..సీఎం ఏఐ తెస్తా..తెస్తా అంటే గిట్ల తెస్తరని అనుకోలే..ఇది సీఎం ప్రైవేట్ ఫొటో ఆల్బమా? లేక గవర్నమెంట్ డాక్యుమెంటా? అని ఎద్దేవాచేశారు.
నాడు కేసీఆర్ హయాంలో 6.18 లక్షల మంది రైతులకు పైసా ఖర్చులేకుండా సాదాబైనామాలకు రిజిస్ట్రేషన్లు చేయించి పట్టాబుక్కులిస్తే.. రేవంత్ సర్కార్ నిబంధనల సాకుతో అమలుచేయకుండా ఇబ్బందులు పెడుతున్నదని హరీశ్ విమర్శించారు. భూ వారసులు బాండ్ పేపర్పై ఆఫిడవిట్ ఇవ్వాలని రూల్స్ పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో 4,06,991 దరఖాస్తులు తిరస్కరణకు గురైతే ఆమోదించినవి కేవలం 172 మాత్రమేనని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి, ఇప్పుడు ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.