ఈ ఏడాది 2.5 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం
హైదరాబాద్, మార్చి 7 : ఆయిల్పామ్ సాగులో రైతులను ప్రోత్సహించేందుకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఆయిల్పామ్ రైతులకు సబ్సిడీలు, డ్రిప్ వ్యవస్థను అందించనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 70 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతున్నది. ఇందులో సుమారు 20 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చిందే కావడం గమనార్హం. 2022-23లో 2.5 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. కాగా, ఆయిల్పామ్ రైతులను ప్రోత్సహించేందుకు మూడేండ్లకు గానూ ఎకరాకు రూ.36 వేల చొప్పున ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.