హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య రంగం దేశానికే మార్గదర్శిగా నిలిచిందని మరో కేంద్ర ప్రభుత్వ నివేదిక కొనియాడింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందుతున్నదని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) స్పష్టంచేసింది. 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ పనితీరును, ప్రజలకు అందుతున్న సేవలను అధ్యయనం చేసి ఈ నివేదికను విడుదల చేసింది. అనేక అంశాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు.
100 శాతం దవాఖాన ప్రసవాలు
దవాఖాన ప్రసవాల విషయంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. 2021-22లో రాష్ట్రంలో 100% దవాఖాన ప్రసవాలు నమోదయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతం లక్ష్యద్వీప్ను మినహాయిస్తే దేశంలోని మరే రాష్ట్రమూ ఈ రికార్డు అందుకోలేదు.
2021-22లో దేశంలోనే అతి తక్కువ గర్భస్రావాలు నమోదైన రాష్ర్టాల్లో తెలంగాణ (0.9 శాతం) రెండో స్థానంలో నిలిచింది. అత్యధిక అబార్షన్లు జరుగుతున్న రాష్ర్టాల్లో బీజేపీ పాలిత అసోం (12.7 శాతం) మొదటి స్థానంలో ఉన్నది.
అతితక్కువ బరువుతో పిల్లలు జన్మిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ చివరి వరుసలో ఉన్నది. రాష్ట్రంలో 6.2 శాతం మంది మాత్రమే తక్కువ బరువుతో జన్మిస్తున్నారు.
చిన్నారులకు టీకాలు అందించడంలోనూ తెలంగాణ ముందువరుసలో నిలిచింది. రాష్ట్రంలో ప్రతి శిశువుకు మీజిల్స్, రుబెల్లా హెపటైటిస్-బీ వంటి వ్యాక్సిన్లు సమయానికి అందుతున్నట్టు నివేదిక స్పష్టంచేసింది.
గర్భిణులు, బాలింతలు, శిశువులకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే రెఫర్ చేసే ‘ఫస్ట్ రెఫరల్ యూనిట్స్’ దేశంలోనే ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
సీఎం కేసీఆర్ విజన్ వల్లే సాధ్యమైంది
రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ముందుచూపుతో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలను ప్రవేశపెట్టారు. మరోవైపు దవాఖానల్లో అత్యాధునిక పరికరాలను, తగినంత సిబ్బందిని ఇచ్చి బలోపేతం చేశారు. వీటి ఫలితాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తున్నది. ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందుతున్నాయని స్పష్టం చేస్తున్నది. ఇంతటి ఘన విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన వైద్యారోగ్యశాఖ పరిధిలోని డాక్టర్లు, వైద్య సిబ్బందికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు.
–హరీశ్రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి