సంగారెడ్డి, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానుక ప్రకటించారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే మహిళలకు ప్రత్యేకంగా వైద్యసేవలు అందించేందుకు కొత్తగా ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని వంద ప్రభుత్వ దవాఖానల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి మంగళవారం ఎంపిక చేసిన వంద దవాఖానల్లో మహిళా వైద్యులు, వైద్య సిబ్బంది మహిళలకు ప్రత్యేకంగా వైద్యసేవలు అందిస్తారని వివరించారు. సోమవారం ఆయన సంగారెడ్డిలో రూ.34 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ.23.70 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ భవనాలతోపాటు టీఎన్జీవో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మెడికల్ కాలేజీలో ఈ-లైబ్రరీని ప్రారంభించి, ఎంబీబీఎస్ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ స్వయం సహాయక సంఘాల మహిళలకు కానుక ప్రకటించారని వెల్లడించారు. ఎస్హెచ్జీ మహిళలు ఎదురుచూస్తున్న వడ్డీ రాయితీ డబ్బులు రూ.750 కోట్లు బుధవారం వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. త్వరలో రాష్ట్రమంతటా గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో రూ.16.59 కోట్లతో మూడు చోట్ల ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గాంధీ దవాఖాన, పేట్లబురుజు దవాఖాన, వరంగల్లో వీటిని ప్రారంభిస్తామని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో ప్రతి నెలా 83% ప్రసవాలు జరుగుతున్నాయని దీనిని 90 శాతానికి పెంచేవిధంగా కృషి చేస్తున్నామమని మంత్రి తెలిపారు.
58 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలే..
కేంద్రం తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వడం లేదని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 58 ఏండ్లలో తెలంగాణకు కేవలం మూడు మెడికల్ కాలేజీలు వస్తే, సీఎం కేసీఆర్ 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేశారని, వీటిలో ఎనిమిదింటిని ఒకేసారి ప్రారంభించామని గుర్తుచేశారు. ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో, పీజీ సీట్లలో ద్వితీయ స్థానంలో ఉన్నదని వివరించారు. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు, ఏడు పీజీ సీట్లు ఉన్నాయని చెప్పారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ భవన నిర్మాణాన్ని ఏడు నెలల్లోనే పూర్తి చేశామని తెలిపారు. బీబీ నగర్ ఎయిమ్స్లో కేంద్రం ఎటువంటి సదుపాయాలు కల్పించలేదని దుయ్యబట్టారు.
ధరణి రద్దు చేస్తే..ప్రజలు మిమ్మల్ని రద్దు చేస్తారు
ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ధరణి పోర్టల్ను రద్దు చేస్తామనే పార్టీలనే ప్రజలు రద్దు చేస్తారని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. పూర్తి పారదర్శకంగా భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల నిర్వహణ జరిగేలా ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్రారంభించిందని వివరించారు. గతంలో భూ రికార్డులు తారుమారై పేదలు ఇబ్బందులు పడేవారని, రికార్డులు సరి చేసుకోవడానికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ధరణి వచ్చిన తరువాత భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతున్నదని చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలను రైతులు పొందుతున్నారని తెలిపారు.
15న చెన్నూర్కు హరీశ్రావు
చెన్నూర్ మార్చి 6: ఈ నెల 15న మంత్రి హరీశ్రావు చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. సోమవారం చెన్నూర్, భీమారం, జైపూర్ మండలాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు.