హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఏకంగా 100 కోట్లకు పైగా చేపపిల్లలను చెరువుల్లో, కుంటల్లో, రిజర్వాయర్లలో వేయనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో టెండర్ ప్రక్రియ ముగియగానే 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టనున్నారు. గతేడాది 17,684 నీటి వనరుల్లో సుమారు 66.87 కోట్ల చేప పిల్లలను, 4.15 కోట్ల రొయ్యపిల్లలను పంపిణీ చేశారు. ఈ ఏడాది సుమారు 30 వేల పైచిలుకు నీటివనరుల్లో 93 కోట్లు చేపపిల్లలు కాగా 25 కోట్ల రొయ్య పిల్లలను వేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారుగా రూ. 105 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.
నీటివనరుల జియోట్యాగింగ్
గతంలో చేపపిల్లలను పంపిణీ చేసే నీటివనరుల గుర్తింపు అశాస్త్రీయంగా ఉండేది. ఇప్పుడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్ఈ) సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా నీటివనరులను జియోట్యాగింగ్ చేశారు. దీంతో ఏ చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంది? ఎన్నిరోజులు నీరు నిల్వ ఉంటుంది? ఎంత మొత్తం చేపలను వేయొచ్చు? వంటి అంశాలను సులువుగా తెలుసుకోనున్నారు. ఈ సాంకేతికత ఉపయోగించుకొని ఈ ఏడాది 30 వేలకు పైగా నీటి వనరులు చేపల పంపిణీకి అనువుగా ఉన్నట్టు గుర్తించారు.
మత్స్యకారులకు పూర్వ వైభవం
కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు వాటిపై ఆధారపడి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉచిత చేపలపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మత్య్సకారుల అభివృద్ధి కోసం 2015లో ప్రారంభించిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నది.