CM Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ‘పంటలు ఎండిపోక ముందే కేసీఆర్ మాకు చెప్పవచ్చు కదా’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పంటలు ఎండిపోయిన తర్వాత ఆ మంటల వద్ద కేసీఆర్ చలికాచుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద 6న కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే బహిరంగసభ ఏర్పాట్లను రేవంత్రెడ్డి మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను ప్రస్తావించారు. పంటలు ఎండిపోకముందే కేసీఆర్ తమకు ఈ విషయం చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు వందల మంది రైతులు చనిపోయారని అంటున్నారని, ఆ వివరాలను తమకు అందిస్తే బాధిత రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తామని వివరించారు. అయితే, అందుకు 48 గంటలు మాత్రమే సమయం ఇస్తున్నామని చెప్పడం గమనార్హం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆర్థికసాయం అందజేస్తామని తెలిపారు. కోడ్ అమల్లోకి వచ్చాక పాలన ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్లడంతో కొన్ని హామీలు నెరవేర్చలేకపోయినట్టు చెప్పారు.
రైతులకు సాయం చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ పదేం డ్ల తర్వాత పొలంబాట పట్టడం సంతోషకరమని తెలిపారు. మాజీ సీఎం అయిన కేసీఆర్కు ఏ సీజన్లో కరువు వస్తుందో తెలియ దా? అని ప్రశ్నించారు. నిరుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే వర్షాలు కురవలేదని, ఆ కారణంగానే కరువు వచ్చిందని చెప్పారు.
ఇప్పుడు ఆ పాపాలను తమ ఖాతాలో వేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు వేసేందుకు 10 నెలల సమయం తీసుకుందని, వారు ఎప్పుడెప్పుడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశారో ఆ వివరాలన్నీ ఉన్నాయని, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చూపించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తాము ఇప్పటికే 65 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమచేశామని, మిగిలింది 4 లక్షలమంది రైతులేనని తెలిపారు.
జనరేటర్తో ప్రెస్మీట్ పెట్టి నిందలా?
జనరేటర్తో ప్రెస్మీట్ పెట్టి విద్యుత్తు పో యిందని తమ ప్రభుత్వంపై కేసీఆర్ నిందలు వేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏదైనా సమస్యపై తాము ఆందోళనకు పిలుపునిస్తే అరెస్ట్ చేసేవారని, కానీ తాము అలా చేయడం లేదని గుర్తుచేశారు. కేసీఆర్ పర్యటనకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని, తాము తలచుకుంటే కేసీఆర్ అసలు బయటకు వచ్చేవారే కాదని పే ర్కొన్నారు.
బాండ్ల రూపంలో వచ్చిన రూ.1500 కోట్లు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయని, ఆ పాపపు సొమ్ము నుంచి రైతులకు ఓ రూ.100 కోట్లు సాయం చేయవచ్చు కదా అ ని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కేసీఆర్ పొలంబాట పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ తమకు సూచనలు చేస్తే, వాటిలో న్యాయమైనవైతే అమలు చేస్తామని తెలిపారు. .
తుక్కుగూడ సభలో మ్యానిఫెస్టో
6న తుక్కుగూడలో జరిగే సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని రేవంత్రెడ్డి తెలిపారు. పార్టీ నేతలతో కలిసి సభా ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సభకు మల్లికార్జునఖర్గే, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ హాజరవుతారని తెలిపారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వస్తే రాష్ర్టానికి జరిగే మే లును ఈ సభ ద్వారా చెప్తామని పేర్కొన్నారు. సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్నికల కోడ్ ముగిశాక మిగతా హామీలను అమలు చేస్తామని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి సర్కారేనని, జూన్ 9న ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం ఉంటుందని రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు.