బయోరంగంలో తెలంగాణ లక్ష్యం
దేశంలోనే తిరుగులేని ప్రగతి తెలంగాణలో
విస్తరణబాటలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు
హైదరాబాద్లో భారీ ఫార్మా క్లస్టర్
ఫార్మారంగానికి కేంద్రం సహకరించాలి
పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్
బయో ఏషియా సదస్సు ప్రారంభం
215 కంపెనీలు.. 6400 కోట్ల పెట్టుబడులు
ఒక్క ఏడాదిలో కల్పించిన ఉద్యోగాలు – 34,000
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రారంభానికి చేరువలో ఉన్నది. ఇందులో అత్యంత అధునాత నమైన, సమర్థమైన పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. తక్కువ ధరలకు నాణ్యమైన ఔషధాలను అందించే లక్ష్యంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకోసం నేనే స్వయంగా ప్రపంచంలోని నిపుణులతో చర్చిస్తున్నా. –మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ తిరుగులేని ప్రగతిని సాధిస్తున్నదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. 2030 నాటికి ఈ రంగం విలువను వంద బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని.. తద్వారా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుద్వారా ఇది సాధ్యపడిందని చెప్పారు. సుస్థిరాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకొంటున్నదని చెప్పారు. లైఫ్సైన్సెస్ రంగంలో మొత్తంగా 215 కంపెనీల ఏర్పాటు ద్వారా రూ.6400 కోట్ల పెట్టుబడులు సాధించడంలో తెలంగాణ విజయవంతమైందని చెప్పారు. నిరుడు ఒక్క సంవత్సరంలోనే 34 వేల ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 200 శాతానికి మించిందని చెప్పారు. ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న బయో ఏషియా 19వ ఎడిషన్ను మంత్రి కేటీఆర్ గురువారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా బయో ఏషియా సదస్సు అర్థవంతమైన చర్చల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లైఫ్సైన్స్ అభివృద్ధికి కృషిచేస్తున్నదన్నారు. ఫైజర్, మొడెర్నా టీకాల అభివృద్ధికి సంబంధించి ఆర్ఎన్ఏపై కృషిచేసి ప్రతిష్ఠాత్మక జినోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డు అందుకొన్న డాక్టర్ డ్రూ వైస్మాన్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లకొద్దీ ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఆయన కృషి తోడ్పడిందని తెలిపారు. లైఫ్ సైన్సెస్ అభివృద్ధి ఆవశ్యకతను కొవిడ్ మహమ్మారి గుర్తుచేసిందన్నారు. ‘ఫ్యూచర్ రెడీ’ థీమ్తో బయోఏషియా సదస్సును నిర్వహించడం సందర్భోచితంగా ఉన్నదని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ తన ప్రత్యేకతను, ఉనికిని చాటుకొంటూనే ఉన్నదని కేటీఆర్ తెలిపారు. పెద్దలకు అందించే కొవిడ్ టీకాలలో మూడింటికిగాను రెండు.. కొవాక్జిన్, కార్బెవాక్స్, అలాగే చిన్నపిల్లలకు ఇచ్చే రెండు వ్యాక్సిన్లు హైదరాబాద్లో తయారు కావడం తమకు గర్వకారణమని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రధాన కంపెనీల పెట్టుబడులు
సింజిన్, డీఎఫ్ఈ ఫార్మా, పిరమల్, సీవీఆర్, లారస్ వంటి ప్రధాన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినట్టు మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. వైద్య పరీక్షలకు అవసరమయ్యే పరికరాలను ఇక్కడే తయారుచేయాలనే లక్ష్యంతో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అందులో ఇప్పటికే 7 కంపెనీలు ప్రారంభంకాగా, వచ్చే 6 నెలల్లో మరో 20 కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభిస్తాయని వెల్లడించారు. ఈ పార్కులో 50 కంపెనీలు తయారీ, ఆర్అండ్డీ యూనిట్లను నెలకొల్పుతున్నట్టు, ఇందులో రూ.1500 కోట్ల పెట్టుబడులు, 7,000 ఉద్యోగాలు రానున్నట్టు పేర్కొన్నారు. ఇవి కాకుండా మెడ్ట్రానిక్, బి-బ్రాన్ తదితర కంపెనీలు మరో రూ.1500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని తెలిపారు. మరిన్ని పెట్టుబడుల కోసం పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు.
2030 నాటికి 100 బిలియన్ల లక్ష్యం
రాష్ట్రంలో లైస్సైన్సెస్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా ఈ రంగం విలువను ప్రస్తుత 50 బిలియన్ల నుంచి 2030 నాటికి 100 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని.. తద్వారా 4 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని నిర్ణయించామని కేటీఆర్ వివరించారు. లైఫ్సైన్సెస్ పరిశోధనల స్థాయి నుంచి తయారీవరకు అభివృద్ధి చేసేందుకు బీ-హబ్ ఏర్పాటు, మౌలిక సదుపాయాల నిధి, డిజిటల్ మెడిసిన్స్ హబ్, పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా మానవ వనరులను తీర్చిదిద్దేందుకు నైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జీనోమ్వ్యాలీలో అనేక ఫార్మాస్యూటికల్ కంపెనీల విస్తరణ కొనసాగుతున్నదని, ప్రముఖ సీఆర్వో అయిన సింజిన్ ఇక్కడ తన కార్యకలాపాలను విస్తరిస్తున్నదని కేటీఆర్ చెప్పారు. జర్మనీకి చెందిన అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థ డీఎఫ్ఈ ఫార్మా ‘క్లోజర్ టు ది ఫార్ములేటర్’ (సీ2ఎఫ్) పేరుతో తమ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీలోని యపన్ బయో సంస్థ విస్తరణకు ఇటీవలే పిరమల్ ఫార్మా రూ.100 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. పోరస్ లైఫ్ సైన్సెస్, సీవీఆర్ లైఫ్ సైన్సెస్, దండు బయో సైన్సెస్, లారస్ సింథసిన్ వంటి కంపెనీలు దాదాపు రూ.500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు.
కేంద్రం తగిన సహకారం అందించాలి
ఔషధాలు, మెడికల్ డివైజెస్ దేశంలో తయారయ్యేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికోసం తగిన విధాన నిర్ణయాలు, రెగ్యులేషన్స్ చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఐపీ పాలసీ, ఎన్ఫోర్స్మెంట్ ఫ్రేమ్వర్క్, రెగ్యులేటరీ రిఫార్మ్స్, యాన్సిలరీ ఇండస్ట్రీస్, ధరల విధానం రేషనలైజేషన్, రీయింబర్స్మెంట్ స్కీమ్స్, డ్యూటీ స్ట్రక్చర్, ప్రోత్సాహకాలు, పరిశోధన-అభివృద్ధికి ప్రోత్సాహకాలు, హెల్త్కేర్ డెలివరీ తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కేంద్రం చర్యలు తీసుకుంటే పెట్టుబడులు పెరగడమే కాకుండా ఆర్థికాభివృద్ధికి దోహదం అవుతుందని కేటీఆర్ చెప్పారు. ఫార్మా మార్కెట్లో వాల్యూమ్ పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉండగా, విలువ పరంగా 14వ స్థానంలో ఉన్నదన్నారు. విలువ, వ్యాల్యూమ్లో ఎంతో వ్యత్యాసం ఉందని, వ్యాల్యూ చెయిన్లోకి వెళ్లడం ద్వారానే ఈ తేడాను పూరించవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఆసియాలోనే అతిపెద్ద సదస్సు
బయోఏషియా సదస్సు ఆసియాలోనే అతిపెద్ద లైఫ్సైన్సెస్, ఆరోగ్యపరిరక్షణ రంగాల వేదిక. కరోనావల్ల ఈ ఏడాది వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. వివిధ దేశాలనుంచి 32 వేలమంది ఈ సదస్సులో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు. హెల్త్టెక్, ఔషధ రంగానికి చెందిన విభిన్న పరిశ్రమలు, బయోఫార్మా, మెడ్టెక్ తదితర అంశాలతోకూడిన సంపూర్ణ ఆరోగ్యపరిరక్షణ రంగం పరివర్తనాత్మక భవిష్యత్తుపై ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ రంగంలో వస్తున్న పెనుమార్పులపై రెండు రోజుల సదస్సులో బృంద చర్చలు జరుగుతాయి.
తక్కువ ధరలకు నాణ్యమైన మందులు
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రారంభానికి చేరువలో ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందులో అత్యంత అధునాతనమైన, సమర్థమైన పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. తక్కువ ధరలకు నాణ్యమైన ఔషధాలను ప్రపంచానికి అందించే లక్ష్యంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం తానే స్వయంగా ప్రపంచంలోని నిపుణులతో చర్చిస్తున్నానని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకోసం ఫ్లో కెమిస్ట్రీకి సంబంధించి హరిత తయారీని ప్రోత్సహించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేశామన్నారు. విలువ, సామర్థ్యం పరంగా లైఫ్సైన్సెస్ విస్తరణకు పుష్కలంగా అవకాశాలున్నాయని చెప్పారు. కంపెనీలు క్లినికల్ రిసెర్చ్, హ్యుమన్ క్యాపిటల్, పరిశోధన-అభివృద్ధి, కాంప్లెక్స్ జెనరిక్స్, దాని అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే ఈ రంగాల్లో ప్రపంచ ఉనికిని కలిగి ఉన్నాయని, వీటి వ్యాల్యూ చెయిన్ను పెంచాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.