బేగంపేట్, ఆగస్టు 1 : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆగస్టు 2 ఆదివారం అమ్మవారికి బోనాలు, 3న రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని ఈవో గుత్తా మనోహర్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తరఫున ఉదయం 3.30 అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం 4 గంటల నుంచి భక్తులు దర్శించుకునేందుకు, బోనాలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే సాధారణ భక్తులకు మూడు క్యూలైన్లు, అలాగే బోనాల సమర్పించే మహిళలకు వేరుగా 2 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీ లకు కూడా మరో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేశారు. బందోబస్త్లో సుమారు 15 వందల మంది పాల్గొంటున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు.
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ దక్కన్ మానవ సేవా సమితి సభ్యులను కోరారు. శనివారం వారితో మారేడ్పల్లిలోని క్యాంపు కార్యలయంలో సమావేశమై సమితి సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే క్యూలైన్లలోనూ వచ్చే భక్తులకు దగ్గరుండి సేవలు అందించాలని సూచించారు. దక్కన్ మానవ సేవా సమితి స్థాపించి వందేళ్లు పూర్తి అయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాల పేరుతో తయారు చేయించిన షీల్డ్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.