హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీల్లో బాలల హాజరుశాతం వందశాతం ఉండేలా చొరవ తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెంచు చిన్నారులకు అంగన్వాడీల ద్వారా పౌష్ఠికాహారం అందించే ‘గిరి పోషణ’ పథకాన్ని సమర్థంగా అమలుచేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయని, మారుమూల ప్రాంతాల్లో అధికారులతో మరింత అవగాహన చర్యలు చేపట్టాలని చెప్పారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు సైతం పూర్తిస్థాయిలో అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పౌష్ఠికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువుకు తగ్గట్టుగా పోషకాహారం అందించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ కార్యదర్శి భారతి హోలీకేరి తదితరులు పాల్గొన్నారు.