హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగుతున్న వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డును ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలపై బీఆర్కేఆర్ భవన్లో మంగళవారం ఆమె ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 17,285 ఉద్యోగాలకు సంబంధించి 17 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని, కొన్ని ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తిచేశామని వివరించారు. గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్లకు సంబంధించి జూలై చివరి నాటికి రాత పరీక్షలు పూర్తి చేస్తామని పేరొన్నారు. నవంబర్ చివరి వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీకానున్న అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి రాత పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,516 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయగా.. ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేశామని, ఏప్రిల్లో రాత పరీక్ష, సెప్టెంబర్ నెలలోగా నియామకాలు జరుపుతామని వెల్లడించారు. మెడికల్, హెల్త్ సర్వీస్ బోర్డు ద్వారా ఆగస్టులోగా 10 వేల వివిధ స్థాయి ఉద్యోగ ఖాళీలను నింపనున్నట్టు తెలిపారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా కూడా 10 వేల పోస్టులకు సెప్టెంబర్ నెలలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు స్పష్టంచేశారు. ఉద్యోగాల నియమాకాల ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకొని సర్వీసు అంశాలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల అంశాల్లో కొన్ని శాఖలలో పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే పరిషరించి ఆయా ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శులు టీకే శ్రీదేవి, రొనాల్డ్ రోస్, హెచ్ఆర్ఎం అండ్ సర్వీసెస్ సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, యూనివర్సిటీ కామన్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు హాజరయ్యారు.