మేడ్చల్, జూలై 16(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయిల్ పామ్ను సాగు చేసేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో అమలులోకి తీసుకువచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లా వ్యాప్తంగా 10 వేల ఎకరాలు అనువుగా ఉన్నట్లు జిల్లా ఉద్యావన శాఖ అధికారులు గుర్తించారు. దీంతో 1000 ఎకరాల నుంచి 10 వేల ఎకరాల వరకు ఆయిల్ పామ్ను రైతులు సాగు చేసేలా ఉద్యానవన శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆయిల్ పామ్ డెవలప్మెంట్ స్కీమ్ 26 జిల్లాల్లో అమలులో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి (వానకాలం) ఈ పంటను మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో సాగు చేసేందుకు అధికార యంత్రాంగం అమలులోకి తీసుకొచ్చింది.
సబ్సిడీపై పరికరాలు
అయిల్ పామ్ సాగుకు అవసరమయ్యే పరికరాలను రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందించనుంది. ఆయిల్ పామ్ సాగుకు సబ్సిడీపై రైతులకు గరిష్ట పరిమితి లేకుండా ఎన్ని ఎకరాల్లో అయినా సాగు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనికి కావాల్సిన సూక్ష్మ, సేద్య పరికరాలను 12.5 ఎకరాల వరకు సాగు చేసే రైతాంగానికి సబ్సిడీపై అందించనున్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులందరికి డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందించనున్నారు. ఎకరానికి 55 నుంచి 57 మొక్కలు వస్తాయి. ఆ మొక్కల సాగుకు అవసరయ్యే పరికరాలు సబ్సిడీపై అందించి పంట సాగు చేసే విధి విధానాలను ఉద్యాన వన శాఖ యంత్రాంగం రైతులకు అవగాహన కల్గించనుంది.
రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ఆసక్తిగా ఉన్న, ఔత్సాహిక రైతుల నుంచి ఉద్యాన వన శాఖ నేటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఆయిల్ పామ్ సాగు ఎన్ని వేల ఎకరాలలో సాగువుతుందన్న విషయాన్ని అంచనా వేస్తాం. సాగు చేసే ఎకరాల ఆధారంగా సబ్సిడీపై స్మూక్ష, సేద్య, డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందిస్తున్నది. ఈ ఏడు వెయ్యి ఎకరాల పై చిలుకు సాగు చేసేలా ఉద్యాన వన శాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు లక్ష్యంగా పెట్టుకుంది. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ఉద్యాన వన శాఖ కార్యాలయాన్ని సంప్రందించాలి.
– కె.నీరజా గాంధీ, ఉద్యాన అధికారి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా