హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది ఎంసెట్ ప్రవేశాల్లో ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పించారు. ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిన తర్వాత తొలిసారిగా ప్రవేశాలు కల్పిస్తుండటంతో ఎస్టీ అభ్యర్థులకు లబ్ధి చేకూరనున్నది. గతంలో ఈ కోటా రిజర్వేషన్లు 6% ఉండగా, ఈ ఏడాది 10 శాతానికి పెంచారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో రిజర్వేషన్ అమలవుతుంది. ఎంసెట్ ఫలితాలు విడుదల కాగా, ప్రవేశాల షెడ్యూల్ సైతం విడుదలైంది. ఈ నేపథ్యంలో ర్యాంకు లు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో టెన్షన్ కనిపిస్తున్నది. ఏ కాలేజీ అయితే బాగుంటుంది? ఏ కోర్సులో చేరితే స్థిరపడతారు? అని శోధిస్తున్నారు. తెలిసిన వారితో ఆరా తీస్తున్నారు. నిరుటి కటాఫ్ ర్యాంకులను పరిశీలిస్తున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్లో భాగంగా ఒక్కో విద్యార్థి అపరిమితంగా ఎన్ని కాలేజీల్లోనైనా వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. కటాఫ్ను చూసి తమకు ఫలానా కాలేజీలో సీటు గ్యారంటీగా వస్తుందని అతిగా ఊహించుకోవద్దని, అన్ని కాలేజీలు, అన్ని బ్రాంచుల్లో వెబ్ఆప్షన్లు ఎంచుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇలాంటి అవకాశాన్నిచ్చినట్టు అధికారులు తెలిపారు. గతేడాది మొదటి, తుది విడత కౌన్సెలింగ్ కటాఫ్ మార్కుల వివరాలను ‘నమస్తే తెలంగాణ’ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయా వివరాలను www.ntnews.com వెబ్సైట్ను సంప్రదించి తెలుసుకోవచ్చు.