హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం ఒకేసారి పది మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో న్యాయమూర్తులు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఉదయం 10 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ ప్రమాణం చేయించారు. న్యాయవాదుల విభాగం నుంచి కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్కుమార్, జువ్వాడి శ్రీదేవి (కుచడి శ్రీదేవి), నాచరాజు వెంకటశ్రవణ్కుమార్, న్యాయాధికారుల కోటా నుంచి వ్యాట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జీ అనుపమ చక్రవర్తి, కరీంనగర్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జి ఎంజీ ప్రియదర్శిని, హైదరాబాద్లో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా చేస్తున్న సాంబశివనాయుడు, న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ డీ నాగార్జున ప్రమాణం చేశారు.
రాజ్యాంగానికి లోబడి న్యాయబద్ధంగా, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తామని వారంతా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. తొలుత వారిని న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి వెలువరించిన ఉత్తర్వులను, కేంద్ర న్యాయశాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ను హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్ ) కే సుజన చదివి వినిపించారు. కార్యక్రమానికి న్యాయమూర్తులు, నూతన న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు ఏజీ జే రామచంద్రరావు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార అనంతరం సీజేతో కొత్త న్యాయమూర్తులు గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత మొత్తం హైకోర్టు న్యాయమూర్తులు 29 మంది కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. వీరిలో 10 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఇంకా 13 ఖాళీలు ఉన్నాయి. ప్రమాణస్వీకారం తర్వాత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన నాలుగు ద్విసభ్య ధర్మాసనాల్లో నలుగురు కొత్త న్యాయమూర్తులు కొలువుతీరి కేసులను విచారించారు. మిగిలిన ఆరుగురు సింగిల్ బెంచ్లో కేసుల విచారణ చేశారు. ద్విసభ్య ధర్మాసనాల్లోని కొత్త న్యాయమూర్తులు తర్వాత ఏకసభ్య ధర్మాసనాల్లో కూడా కేసుల విచారణ చేపట్టారు.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గా కే సుజనను నియమిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఆమె హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ విభాగ రిజిస్ట్రార్గా ఉన్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్ జనరల్గా పనిచేసిన డాక్టర్ డీ నాగార్జున హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాగార్జున నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు.
ముమ్మినేని సుధీర్ కుమార్: ఖమ్మం జిల్లాకు చెందిన సుధీర్ కుమార్ది వ్యవసాయ కుటుంబం. చర్లలో ఇంటర్ వరకు చదివారు. ఏలూరులోని సీఆర్రెడ్డి కాలేజీలో డిగ్రీ, నాందేడ్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరఠ్వాడ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ చేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎంఆర్కే దరి వద్ద జూనియర్గా చేశారు. అన్ని కోర్టుల్లోనూ న్యాయవాదిగా కేసులను వాదించారు.
జువ్వాడి శ్రీదేవి: 1997 అక్టోబర్ 31న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2004 అక్టోబర్ నుంచి 2008 ఫిబ్రవరి వరకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు. హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చాక 2014 జూలై 30 నుంచి 2017 నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. హైకోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. ఈమె భర్త కూచాడి శ్రీహరిరావు.. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, న్యాయవాది కూడా.
నాచరాజు వెంకట శ్రవణ్ కుమార్: ఈయన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనుమడు. పీవీ పెద్ద కూతురు శారద వెంకట కిషన్రావు చిన్న కుమారుడు. బీకాం, ఎంబీఏ, ఎల్ఎల్బీ, నల్సార్లో సైబర్ లాలో పీజీ డిప్లొమా చేశారు. 2005 నవంబర్ 17న లాయర్గా ఎన్రోల్ అయ్యారు. రావు అండ్ కో లాయర్స్ ఆఫీసులో జూనియర్గా చేరారు. కింది కోర్టులు, హైకోర్టు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్లో కేసులు వాదించారు. న్యాయవాదిగా సమర్థుడనే పేరుంది. నీటిపారుదలశాఖ వ్యవహారాల ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.
జీ అనుపమ చక్రవర్తి: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జన్మించిన అనుపమ చక్రవర్తి.. 1994లో ఎన్రోల్ అయ్యారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది టీ నిరంజన్ రెడ్డి వద్ద జూనియర్గా పనిచేశారు. తర్వాత 2006-08 మధ్య అసిస్టెంట్ జీపీగా చేశారు. 2008 నవంబర్ 2న అడిషనల్ జిల్లా జడ్జిగా విధుల్లో చేరారు. 2019 నుంచి 2020 సెప్టెంబర్ వరకు కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా చేశారు. న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా గత ఏడాది ఆగస్టు వరకు చేశారు. కొద్దిరోజులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా, సహకార ట్రిబ్యునల్ చైర్పర్సన్గా పనిచేశారు. ఇప్పటివరకు వ్యాట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా కొనసాగారు.
మాటూరి గిరిజ ప్రియదర్శిని: మాటూరి గిరిజ ప్రియదర్శిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించారు. 1995లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాక.. విశాఖ జిల్లా కోర్టులో ఏడేండ్లు ప్రాక్టీస్ చేశారు. జిల్లా జడ్జి పరీక్షల్లో ఎంపికై 2008లో గుంటూరులో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేండ్లు, విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా పని చేశారు. 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్గా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా చేశారు. 2019 నుంచి కరీంనగర్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేశారు.
సాంబశివరావు నాయుడు: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సాంబశివరావు నాయుడు.. 1986లో రామచంద్రపురంలోని క్రిమినల్ న్యాయవాది పిళ్లా జానకిరామయ్య వద్ద జూనియర్గా చేరారు. 1991లో డిస్టిక్ట్ మున్సిఫ్గా ఎంపికయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, అదనపు డిస్ట్రిక్ట్ జడ్జిగా హుజూరాబాద్, కరీంనగర్, వరంగల్, కొత్తగూడెం, తిరుపతిలో పనిచేశారు. జిల్లా జడ్జిగా మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుల్లో విధులు నిర్వర్తించారు. 2019 నుంచి ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల విచారణ చేసే హైదరాబాద్లోని కోర్టులో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా కొనసాగుతున్నారు.
అనుగు సంతోష్ రెడ్డి: జగిత్యాల జిల్లా జోగన్పల్లిలో పుట్టిన ఈయన.. 1985లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. కరీంనగర్ జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. డిస్టిక్ట్ మున్సిఫ్గా 1991లో ఎంపికై, 2004లో సీనియర్ సివిల్ జడ్జిగా, 2010లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. సిద్దిపేట అదనపు జిల్లా జడ్జిగా చేస్తుండగా 2013లో న్యాయశాఖ కార్యదర్శి అయ్యారు. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ వరకు రంగారెడ్డి జిల్లా అదనపు జడ్జిగా పనిచేశారు. 2018 అక్టోబర్లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా చేస్తుండగానే, 2019 నవంబర్లో రెండోసారి న్యాయ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
డాక్టర్ దేవరాజు నాగార్జున: వనపర్తికి చెందిన డాక్టర్ దేవరాజు నాగార్జున.. 1986లో లాయర్గా ఎన్రోల్ అయ్యారు. వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 1991 మే 1న జూనియర్ సివిల్ జడ్జిగా విధుల్లో చేరారు. 2004లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి వచ్చింది. ఏపీ పోలీస్ అకాడమీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. 2010లో జిల్లా జడ్జిగా పదోన్నతి లభించింది. 2015లో హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) అయ్యారు. తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్), మధ్యలో కొద్ది రోజులు ఎంఎస్జేగా చేశారు. గత ఏడాది అక్టోబర్ 18 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా ఉన్నారు. జువనైల్ జస్టిస్ వంటివే కాకుండా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన సేవలను వేదిక పైనుంచి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడటం గమనార్హం.
కాసోజు సురేందర్: మహబూబ్నగర్కు చెందిన కాసోజు సురేందర్.. 1992లో ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ క్రిమినల్ లాయర్ పీ సీతాపతి వద్ద జూనియర్గా చేరారు. 2005-2008 వరకు హైకోర్టులో కేంద్రం తరఫున అడిషనల్ స్టాండింగ్ కౌన్సెల్గా, 2010లో పీపీగా, సీబీఐ కౌన్సెల్గా చేశారు. 2013లో రెండోసారి సీబీఐ స్పెషల్ పీపీగా, జగన్ ఆస్తుల కేసులో సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్గా చేశారు. హైకోర్టులో ఎన్ఐఏ కౌన్సెల్గా దిల్సుఖ్నగర్, గోకుల్చాట్, లుంబినీపార్క్ బాంబుపేలుడు కేసులను వాదించారు. జడ్జి అయ్యే వరకు సీబీఐ స్పెషల్ పీపీగా చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్కు, ఎన్ఐఏకు స్పెషల్ పీపీగా పనిచేశారు.
సూరేపల్లి నందా: 1993 ఆగస్టు 4న న్యాయవాదిగా ఎన్రోల్ అయిన నందా.. 27 ఏండ్లుగా హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. నందా వాదించిన కేసుల్లో 64 తీర్పులు రిపోర్టు అయ్యాయి. ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ అడ్వొకేట్గా, కమిటీ సభ్యురాలిగా చేశారు. జిల్లాల్లోని లాయర్ల లీగల్ ఎయిడ్ ప్యానల్లో ఉన్నారు. బార్ కౌన్సిల్కు స్టాండింగ్ కౌన్సెల్గా, 2001-04లో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా చేశారు. 2010-15 మధ్య కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. పలు బ్యాంకులు, ఎన్ఐఆర్డీ, మహిళా కమిషన్కు స్టాండింగ్ కౌన్సెల్గా చేశారు. గత ఏడాది జూలై 3న సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి లభించింది.