శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. లక్షల క్యూసెక్కుల నీటి ఇన్ఫ్లో వస్తుండటంతో రెండు రోజులుగా డ్యాం 10 గేట్లను 15 అడుగుల ఎత్తులో తెరిచి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం జూరాల ప్రాజెక్టు నుండి 2,14,994 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 27,943, సుంకేశుల నుండి 1,60,338 క్యూసెక్కుల ( మొత్తం 4,03,275 క్యూసెక్కులు ) నీరు శ్రీశైలానికి విడుదల కాగా సాయంత్రం వరకు 4,55,614 క్యూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తులో తెరచి 3,77,670 క్యూసెక్కుల నీటిని, కుడి ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 58,624 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఏంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 213.40 టీఏంసీలుగా ఉంది.