నల్లగొండ: ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna sagar) నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు, ఎస్ఈ ధర్మానాయక్ ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 77,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్కు 4,72,708 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,17,580 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 586.90 అడుగుల నీటిమట్టం ఉన్నది. సాగర్ గరిష్ట నీటినిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ఇప్పుడు 304.9495 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా పెరుగుతున్నది. ప్రాజెక్టుకు 3,88,717 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిగా నిండటంతో అధికారులు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి 3,79,110 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.60 అడుగులు ఉన్నది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.