Rs.1 Lakh aid for BCs | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం (6వ తేదీ) నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఈ నెల 9న మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా లబ్ధిదారులకు సాయం అందించడంతోపాటు అదేరోజు అన్ని నియోజకవర్గాల్లో గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలతో పథకాన్ని ప్రారంభించనున్నారు.
రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం రూపొందించిన https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, బీసీ కులవృత్తులు నిర్వహించుకొనే చేతివృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం అండగా నిలువనున్నదని చెప్పారు. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాలలో పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించనున్నట్టు చెప్పారు. లబ్ధిదారులు వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. గత క్యాబినెట్ సమావేశంలో తీసుకొన్న నిర్ణయం మేరకు క్యాబినెట్ సబ్ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు విధివిధానాలను ఇప్పటికే ఖరారు చేసిందని వెల్లడించారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.