హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనున్నది. ఒక్కో తరగతి పుస్తకాల బరువు 25 నుంచి 30 శాతం మేర తగ్గనున్నది. పాఠ్యపుస్తకాల ముద్రణను వినియోగించే పేపర్ మందం తగ్గడమే ఇందుకు కారణం. ఇదివరకు 90 జీఎస్ఎం (గ్రామ్స్ పర్ స్కేర్ మీటర్ ) మందం పేపర్ను వినియోగించగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 70 జీఎస్ఎం మందం పేపర్ను ఉపయోగించుకొనేందుకు ఇటీవలే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పుస్తకాలు తేలికగా, సన్నగా మారుతాయి.
ప్రతి నెలలో చివరి శనివారం బ్యాగ్లెస్డేగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు విద్యార్థులు బ్యాగ్ లేకుండాగానే బడికొస్తారు. వారికి కొన్ని కృత్యాల ద్వారా పాఠాలను నేర్పిస్తున్నారు.
2024 -25 విద్యాసంవత్సరంలో 1.90 కోట్ల ఉచిత పుస్తకాలను ముద్రించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. ఇందుకు రూ.150 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని తేల్చారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పదో తరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో 1 నుంచి 10 తరగతుల్లోని విద్యార్థులందరికీ ద్విభాషా పుస్తకాలు (తెలుగు, ఇంగ్లిష్) అందజేస్తారు. పుస్తకం సైజు పెరగడంతో పుస్తకాలను పార్ట్ -1, పార్ట్ -2గా విభజించారు. ఏప్రిల్ 30లోపు పార్ట్ -1 ముద్రిత పుస్తకాలను జిల్లా పాయింట్లకు చేర్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇక జూలైలో పార్ట్ -2 పుస్తకాలను అందిస్తారు. స్మార్ట్ఫోన్లలో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్చేసి అన్ని తరగతుల్లో పుస్తకాల పాఠాలను విద్యార్థులు చదువుకోవచ్చు.
పేపర్ మందం తగ్గించడంతో విద్యాశాఖ కొనుగోలు చేయాల్సిన పేపర్ 3 వేల టన్నులకు పైగా తగ్గింది. ఇది వరకు వినియోగించిన 90 జీఎస్ఎం పేపర్తో ఏటా 11,700టన్నుల పేపర్ను సేకరించాల్సి ఉండగా, 70 జీఎస్ఎంకు తగ్గించడంతో 8 వేల టన్నులకు చేరింది. బడ్జెట్ కూడా రూ.30 నుంచి 40 కోట్లకు తగ్గింది.