జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 23: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్, బీజేపీ విషప్రచారం చేస్తున్నాయని ఓయూ, శాతవాహన విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీ నాయకులు భాస్కర్, చైతన్య విమర్శించారు. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్కుమార్కు మద్దతుగా జగిత్యాలలో ఓయూ, ఎస్యూ జేఏసీ, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో 1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని అన్నారు. 47 వేల పోలీసు ఉద్యోగాలు, టీఎస్పీఎస్పీ ద్వారా 35 వేలు, గురుకుల విద్యాసంస్థల్లో 3,600 ఉద్యోగాలు, ఇతర రిక్రూట్మెంట్ల ద్వారా 41 వేల ఉద్యోగాలను ఇదివరకే భర్తీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
మరో 55 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయగా, ఎన్నికల కోడ్తో నిలిచిపోయిందని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నియామక ప్రక్రియను భర్తీ చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 1,001 గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేయగా, వీటిల్లో 6.50 లక్షల మంది పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తున్నదని చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఏ ఒక్క ఉద్యమ నాయకుడినైనా గుర్తించిందా? ఏ ఒక్క ఉద్యమకారుడికైనా ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లిచ్చారా? అని ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులను కేసీఆర్ గుర్తించి ఎంపీ, ఎమ్మెల్యేలను చేశారని చెప్పారు.