యాదాద్రి, డిసెంబర్ 23: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ఆలయ ప్రారంభం అనంతరం యాదాద్రి ఆలయానికి రోజుకు సుమారు 1.5 మెగావాట్ల విద్యుత్తు సరఫరా చేయనున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు సరఫరా తీరుపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీజీఎం భిక్షపతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మీటరింగ్ నుంచి వ్రత మండపం వైపు ఉన్న ప్యానల్ రూమ్-1, యాదాద్రి ప్రధానాలయం వైపు ఉన్న ప్యానల్ రూమ్-2 విద్యుత్తు బోర్డుకు కరెంట్ తీసుకెళ్లాల్సిన విధానాన్ని పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి 28న యాదాద్రి ప్రధానాలయం పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటంకాలు లేకుండా విద్యుత్తును సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన పనులను ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే హైటెన్షన్ లైన్లు వేశారు. రెండు ఫీడర్ల ద్వారా విద్యుత్తును అందజేయనున్న నేపథ్యంలో పనుల్లో వేగం పెంచి నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభంలోపు విద్యుత్తు పనులు పూర్తి కావాలని సూచించారు.