హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చింది. ఇన్నాళ్లు ప్రయివేటు పాఠశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు పరుగెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే విద్యార్థుల పునరాగమనానికి నిదర్శనం. నాణ్యమైన, పటిష్టమైన విద్యను విద్యార్థులకు అందివ్వడంతో మంచి ఫలితాలను సాధిస్తున్నారు. దీంతో ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పిల్లలను ప్రయివేటుకు కాకుండా సర్కార్ బడికి పంపేందుకు తల్లిదండ్రులు సైతం ఆసక్తి చూపుతున్నారు.
2021-22 విద్యాసంవత్సరంలో ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న 1.25 లక్షల మంది విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. దీంతో గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40 శాతం పెరిగింది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి మధ్యలోనే ఈ సంఖ్య పెరిగినట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
అయితే ప్రయివేటు పాఠశాలలు అధికంగా ఫీజులు పెంచడంతో పేదలు.. ఆ డబ్బు చెల్లించే పరిస్థితుల్లో లేరు. ఉపాధి అవకాశాలు కూడా సరిగా లేకపోవడంతో పలు కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రయివేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తల్లిదండ్రులు విశ్వసించారు. దీంతో తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్నారు.
విద్యార్థుల పెరుగుదల కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే అధికంగా నమోదైంది. రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో ప్రయివేటు పాఠశాలల పిల్లలు చేరలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గవర్నమెంట్ డే స్కూల్స్లోనే 40 శాతం అధికంగా విద్యార్థులు చేరినట్లు అధికారులు తెలిపారు.
విద్యా శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. 2020 ఏడాదిలో 85 వేల ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు తేలింది. అంతకు ముందు విద్యాసంవత్సరంతో పోలిస్తే 40 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. కరోనా కంటే ముందు ఈ సంఖ్య అతి తక్కువగా ఉందన్నారు. కరోనా ఎఫెక్ట్ తర్వాతనే ఏడాదికి ఏడాది ఈ సంఖ్య పెరిగిపోతోందని అధికారులు స్పష్టం చేశారు. 2018 విద్యాసంవత్సరాన్ని పరిశీలిస్తే విద్యార్థుల నమోదు అతి తక్కువగా ఉంది. 50 శాతం కంటే తక్కువే అని చెప్పొచ్చు. ఒక వేళ విద్యార్థుల నమోదు పెరిగినా అది కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే అని అధికారులు పేర్కొన్నారు.