హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): స్వయంసాధికారతే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. దళితుల్లో అత్యంత నిరుపేదల్ని గుర్తించి వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించటం ద్వారా ఆ కుటుంబం శాశ్వత పేదరికం నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపల్పన చేశారు. హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలవుతున్న ఈ ప్రతిష్ఠాత్మక పథకం ద్వారా లబ్దిపొందిన దళిత కుటుంబాలు ఏయే రంగాలను ఎంచుకొని పురోగమించవచ్చో అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి, ఒక కుటుంబానికి మరో కుటుంబానికి ఏకరీతి విధానం ఉండకపోవచ్చు. లబ్ధిపొందే అర్హుల అభిరుచి, అర్హత, అనుభవం వీటితోపాటు అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఈ మూడు క్యాటగిరీలుగా ప్రాంతాలను విభజించి వారుండే ప్రాంతాల్లో ఉండే వనరులు, మార్కెట్ అవసరాలు తదితర అంశాల ప్రాతిపదికగా.. సదరు కుటుంబాలు తమ కాళ్ల మీద తాము నిలదొక్కుకోవటానికి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నది. దళితబంధు కింద ఎలాంటి అంశాలను పరిశీలించవచ్చు.. ఏ తరహా స్కీములను అమలు చేయవచ్చో.. ఆలోచన చేస్తున్నది.