నారాయణపేట/హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నాలుగు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. సర్వేలన్నీ కాంగ్రెస్ ఓడిపోతుందన్న సమాచారం.. చెప్పే మాటలు ప్రజలు నమ్మబోరని తెలిసిపాయే.. గ్యారెంటీలు కావవి, అంతా గిల్ట్ అని తేలిపాయే.. ఇక పార్టీ గట్టెక్కేది సానుభూతి జపంతోనేనని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారా? అంటే.. అవుననే అనుమానం కలుగుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ ప్రజల సానుభూతి పొందేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఒకవైపు సానుభూతి జపం, మరోవైపు హామీల తంత్రంతో ఓటర్లకు గాలం వేయాలని చూశారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారని సీఎం రేవంత్రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పించారు. ఏం దొరల బిడ్డలే సీఎం కావాలా? పాలమూరు బిడ్డకు, ఒక పేద రైతు బిడ్డ సీఎం కాకూడదా? అని దీనంగా అడుగుతూ సానుభూతి పొందాలని చూశారు.
‘పాలమూరు అభివృద్ధికి మనకు మనమే సంతకం చేయకూడదా?; ఇక్కడ సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలోనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ ఎంపీ సీట్లు గెలవకపోతే, అక్కడ ఢిల్లీలో నా ప్రతిష్ఠ పలుచన కాదా?; జిల్లాలో ఎలాగైనా రెండు సీట్లు గెలిపించి నా పరువు కాపాడాలి; నన్ను రాజకీయంగా బలహీన పరిచేందుకు గజ్వేల్ ఫాంహౌజ్ నుంచి కేసీఆర్, ఢిల్లీలో ప్రధాని మోదీ గొడ్డలి పట్టుకొని మీరు నాటిన చెట్టును నరకటానికి తిరుగుతున్నారు’ అంటూ ప్రజల్లో స్థానిక సెంటిమెంట్ను, భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ను ఓడించటానికి బీఆర్ఎస్-బీజేపీ చేతులు కలిపాయని ఆరోపించారు. ఐదు సీట్లలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకొన్నదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన రెండు నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, ఎంపీ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికే పదవులు వస్తాయంటూ ద్వితీయ శ్రేణి నాయకులకు గాలం వేశారు. ముదిరాజ్, యాదవ, రజకులకు పెద్ద పీట వేస్తామంటూ ఆ వర్గాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. పాలమూరు ఎంపీ నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా ఉన్న ముదిరాజ్ ఓటర్లకు గాలం వేసేందుకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఆగస్టు 15 కల్లా మంత్రి పదవి ఇస్తామని ప్రకటించటం గమనార్హం.
డీకే అరుణ.. ఒళ్లంతా దొరసానే:వంశీచందర్రెడ్డి
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న డీకే అరుణ మామూలు దొరసాని కాదని, ఒళ్లంతా దొరసానేనని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ వంశీచందర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బడుగు, బలహీనవర్గాల దొరసాని అని, ముదిరాజ్, యాదవ, కురుమ కులాల పాలిట దొరసాని అని, గద్వాల బంగ్లా రాజకీయాలు చేసే దొరసాని అని అన్నారు.
జనం లేని జనజాతర
నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభ జనం లేకుండానే కొనసాగింది. సభకు హాజరైన జనం కూర్చునేందుకు వేసిన కుర్చీలు సగం ఖాళీగానే దర్శనమిచ్చాయి. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతుండగానే కొందరు సభాప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు.
సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
రేవంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లో చేరారు. వీరిలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జీ ఈశ్వర్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్రెడ్డి ఉన్నారు.
ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ: సీఎం రేవంత్
ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. కులగణన చేపట్టి తీరుతామని, వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి ప్రతి చివరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. గ్రామీణ స్థాయి లో ఇందిరమ్మ కమిటీలను వేస్తామని తెలిపారు.