
హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు కొత్తగా నియమితులైన పార్టీ జిల్లా అధ్యక్షులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్ శుక్రవారం కేటీఆర్ను కలిసి తమ నియామకం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి పార్టీ వారధిగా ఉండాలని, అందుకు అనువైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై ఉంచిన బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తామని, పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని కేటీఆర్తో జిల్లా అధ్యక్షులు చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు గణేశ్గుప్తా, హన్మంత్ షిండే, డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు.